Gold Man Kunjal Patel : గోల్డ్మ్యాన్ ఆత్మహత్య
ఒంటిపై కిలోన్నర బంగారంతో అందర్నీ ఆకర్షించిన కుంజల్ పటేల్, అలియాస్ కేపీ పటేల్ బలవన్మరణానికి పాల్పడ్డాడు.తన ఇంటిలోనే గొంతుకోసుకుని ఆత్మహత్య చేసుకోవటం కలకలం రేపింది.
గుజరాత్, అహ్మదాబాద్ లోని మధుపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కుంజల్ పటేల్ మధుపురలోని యోగేష్ సోసైటీలో నివాసం ఉంటున్నాడు. అక్కడే వాహనాల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ధరియాపూర్ నియోజకవర్గం నుంచి శివసేన అభ్యర్ధిగా ఎన్నికల్లో పోటీ చేశారు.
కేపీ పటేల్ గత శనివారం ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. పదునైన కత్తితో గొంతు కోసుకుని ఈదారుణానికి ఒడిగట్టాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు మధుపుర పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి విచారణ ప్రారంభించారు.
కుంజల్ ఎప్పడూ తన ఒంటిపై కిలోన్నర కంటే ఎక్కువ బంగారాన్ని ధరించి తిరుగుతూ ఉండటంతో ఆయన్ను అందరూ గోల్డ్ మ్యాన్ అని పిలిచేవారు. అయితే కుంజల్ ఆత్మహత్యకు ముందు అతని భార్యతో గొడవ పడినట్లు పోలీసు విచారణలో తేలింది.
కాగా… వ్యాపారానికి సంబంధించి కుటుంబంలో జరిగిన గొడవల వల్లే కుంజల్ ఆత్మగత్య చేసుకున్నాడా లేక వేరే ఏమైనా వ్యాపార లావాదేవీల వల్ల ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు.