Pudding Mink Pub : డ్రగ్స్ అమ్మేది మీరే.. పబ్లో పట్టుబడిన వారంతా బీజేపీ, కాంగ్రెస్ నేతల పిల్లలే- బాల్క సుమన్
డ్రగ్స్ అమ్మేది బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతల సన్నిహితులే. కేసు దర్యాప్తు పూర్తయితే మరిన్ని పేర్లు బయటకు వస్తాయి.(Pudding Mink Pub)
Pudding Mink Pub : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన హైదరాబాద్ లోని పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ కేసు రాజకీయ రంగు పులుముకుంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఆ పబ్ వెనుకున్నది మీరంటే మీరే అంటే ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ఈ వ్యవహారంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికార టీఆర్ఎస్ ను టార్గెట్ చేశాయి. డ్రగ్స్ కేసులో పలుకుబడి ఉన్నవాళ్ల పేర్లు తొలగిస్తున్నారంటూ బీజేపీ ఆరోపించింది. డ్రగ్స్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ మండిపడింది. బంజారాహిల్స్ పబ్ లో దొరికిన అందరినీ కఠినంగా శిక్షించాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు డిమాండ్ చేశాయి.
తాజాగా ఈ వ్యవహారంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పందించారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను బాల్క సుమన్ ఖండించారు. ప్రతిపక్షాలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ నడిపేది బీజేపీ నేత కొడుకే అని బాల్క సుమన్ ఆరోపించారు. పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ నిర్వహకుడు ఉప్పల అభిషేక్.. బీజేపీ నేత ఉప్పల శారద కొడుకే అన్నారు బాల్క సుమన్. పబ్ నిర్వహించింది బీజేపీ, కాంగ్రెస్ వారేనని.. పార్టీకి వెళ్లింది ఆయా పార్టీలకు చెందిన నేతల కొడుకులే అని బాల్క సుమన్ అన్నారు.
శనివారం రాత్రి వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారంలో రేవంత్ రెడ్డి మేనల్లుడు, ఓ బీజేపీ నేత కుమారుడు ఉన్నారని బాల్క సుమన్ సంచలన ఆరోపణలు చేశారు. డ్రగ్స్ అమ్మేది బీజేపీ నేతలే అన్నారు. ఈ వ్యవహారంలో తమ పిల్లల పాత్రకు స్పందించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తమ పదవులకు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
”శనివారం నాటి పోలీసుల తనిఖీల్లో రెండు జాతీయ పార్టీల నేతల పిల్లలే దొరికారు. ఇంకా కొంత మంది నేతల పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో మరిన్ని కీలక విషయాలు బయటకు వస్తాయి. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు కేసీఆర్ రివ్యూలు చేశారని, ఈ కారణంగానే డ్రగ్స్పై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది” అని బాల్క సుమన్ చెప్పారు.
”ఈ ఘటనతో బీజేపీ, కాంగ్రెస్ నేతల చిల్లర వ్యవహారాలు బయటపడుతున్నాయి. డ్రగ్స్ అమ్మేది బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతల సన్నిహితులే. కేసు దర్యాప్తు పూర్తయితే మరిన్ని పేర్లు బయటకు వస్తాయి. డ్రగ్స్ సప్లయిర్స్తో పాటు వాడకందార్లను అరెస్టు చేస్తున్నాం. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుంటే ఇంత మందిని అరెస్ట్ చేస్తుందా? మాదకద్రవ్యాలపై కేసీఆర్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. డ్రగ్స్ వ్యవహారంలో టీఆర్ఎస్ నేతల హస్తం ఉందన్న బీజేపీ, కాంగ్రెస్ నేతలకు సిగ్గుండాలి. ప్రతి చిన్న విషయాన్ని టీఆర్ఎస్కు ఆపాదించడం రెండు పార్టీలకు అలవాటుగా మారింది. బీజేపీ, కాంగ్రెస్ నేతల పిల్లలు డ్రగ్స్ కేసులో ఉన్నారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ రేవంత్ రెడ్డి, బండి సంజయ్ తమ పదవులకు రాజీనామా చేయాలి” అని బాల్క సుమన్ డిమాండ్ చేశారు.
Pudding And Mink Pub : ఫుడ్డింగ్ పబ్ కేసు.. కీలకాంశాలివే, ఇద్దరు పరార్
”డ్రగ్స్, గంజాయి మత్తులో ఊగుతున్నది జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ నాయకుల పిల్లలే. పబ్ లో డ్రగ్స్ వినియోగం జరుగుతోందని పోలీసులకు సమాచారం అందడంతో దాడులు జరిపి చాలామందిని అదుపులోకి తీసుకున్నారు. ఆ పబ్ నిర్వాహకుడు బీజేపీ నాయకురాలు ఉప్పల శారద కుమారుడు అభిషేక్ ఉప్పల అని తేలింది. ఉప్పల శారద 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేశారు. అభిషేక్.. బీజేపీ కండువా కప్పుకుని ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు” అని తెలిపిన సుమన్.. అందుకు సంబంధించిన ఫోటోలను విడుదల చేశారు.
ఈ పబ్ కేసులో రేవంత్ రెడ్డి మేనల్లుడి పేరు కూడా ఉందని సుమన్ ఆరోపించారు. పోలీసులు విడుదల చేసిన జాబితాలో 24వ పేరు సూదిని ప్రణయ్ రెడ్డి (రేవంత్ మేనల్లుడు)ది అని చెప్పారు. ఈయన కాంగ్రెస్ పార్టీ యూత్ లీడర్ కూడా అని తెలిపారు. దీంతో ఈ రెండు జాతీయ పార్టీలకు సంబంధించిన నాయకుల పిల్లలు పాల్గొన్నట్లు క్లియర్గా తెలుస్తోందన్నారు.
బంజారాహిల్స్లోని ర్యాడిసన్ బ్లూ హోటల్ లోని పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ పై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో డ్రగ్స్ వాడుతున్నట్లు బయటపడటం సంచలనంగా మారింది. పోలీసులు ఈ కేసును సీరియస్గా తీసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు.