మూడో అంతస్తు నుంచి ప్రియురాలిని తోసేశాడు
హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మూడో అంతస్తు పైనుంచి ప్రియురాలిని కిందకు తోసివేయడంతో ఆమె మృతి చెందింది. ఈ ఘటన వనస్థలిపురంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మధ్యప్రదేశ్కు చెందిన సీమ, దిలీప్లు 15 రోజుల క్రితం హైదరాబాద్ కు వచ్చారు. నగరంలోని వనస్థలిపురం శక్తినగర్లోని వాసవి నిలయం భవనం నిర్మాణం జరుగుతుంటే అందులో పనికి చేరారు.
ఈక్రమంలో గురువారం (అక్టోబర్ 17, 2019) సీమను దిలీప్ నిర్మాణంలో ఉన్న మూడోఅంతస్తు పైనుంచి కిందికి తోసివేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం యువతిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడు దీలిప్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.