ప్రేమ తిరస్కరించిందని మహిళా ఎస్సైని కాల్చేశాడు..
తన ప్రేమను తిరస్కరించిందనే కారణంతో తోటి మహిళా ఎస్సైని మరోక ఎస్సై కాల్చి చంపిన ఘటన వాయువ్య ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగటానికి ఒక రోజు ముందు ఈ ఘటన చోటుచేసుకోవడం శోచనీయం. శుక్రవారం, ఫిబ్రవరి7వతేదీ రాత్రి వాయువ్య ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. 26 ఏళ్ల పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రీతి అహ్లావత్.. రోహిణి ప్రాంతంలో ఉన్న మెట్రో స్టేషన్ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో మరోక ఎస్సై దీపాన్షు రతి ఆమెపై కాల్పులు జరిపాడు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితుడిని గుర్తించారు. దీపాన్షు 3 సార్లు ప్రీతిపై కాల్పులు జరిపినట్లు నిర్ధారించారు. ప్రీతి తలలోకి బుల్లెట్లు దిగటంతో, ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి శవపరీక్ష నిర్వహిస్తున్నారు. దీపాన్షు పోలీసు అకాడమీలో 2018లో ఆమె బ్యాచ్ మేట్ అని పోలీసులు వివరించారు. కానీ ఇంత వరకు ఎవర్నీ అరెస్టు చేయలేదు.
హర్యానాలోని సోనిపట్కు చెందిన ప్రీతి.. పత్పర్గంజ్ పారిశ్రామిక ప్రాంతంలో ఎస్సైగా విధులు నిర్వహిస్తూ రోహిణీలోని ఒక అపార్ట్ మెంట్లో అద్దెకు ఉంటున్నారు. ప్రీతి అహ్లవత్ను హత్య చేసిన తర్వాత దీపాన్షు రతి కూడా హర్యానాలోని సోనిపట్లో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
దీపాన్షు రతి, ప్రీతి అహ్లావత్ ను ప్రేమిస్తున్నాడని…అతడి ప్రేమను, పెళ్లి ప్రపోజల్ ను ఆమె తిరస్కరించినందువల్లే కాల్పులకు తెగబడినట్లు పోలీసులు తెలిపారు. శనివారం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఢిల్లీ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు చోట్ల చెక్ పోస్టులు పెట్టి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. పోలీసుల పారా మిలటరీ బలగాలను రహదారులపై మొహరించారు.