Fake Currency Gang : నకిలీ నోట్ల తయారీ ముఠా అరెస్ట్-రూ.45 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం
గుంటూరు జిల్లాలో దొంగనోట్ల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఏడుగురువ్యక్తులను అరెస్ట్ చేసి 45 లక్షల రూపాయల నకిలీ నోట్లను సీజ్ చేశారు.
Fake Currency Gang : గుంటూరు జిల్లాలో దొంగనోట్ల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఏడుగురువ్యక్తులను అరెస్ట్ చేసి 45 లక్షల రూపాయల నకిలీ నోట్లను సీజ్ చేశారు. నకిలీ నోట్ల ముద్రణకు ఉపయోగించే ప్రింటర్లు, జిరాక్స్ మిషన్లు, స్కానర్లు, పేపర్లను సీజ్ చేశారు. ముఠా ఉపయోగిస్తున్న రెండు కార్లను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కలర్ జిరాక్స్ సాయంతో.. వంద, రెండు వందలు, ఐదు వందల నోట్లను ప్రింట్ చేసి..తెలుగు రాష్ట్రాల్లో మార్పిడి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కిన కేటుగాళ్లకు పోలీసులు సంకెళ్లు వేశారు. ఇప్పటివరకు ఈ ముఠా రెండు నుంచి నాలుగు లక్షల వరకు నకిలీ నోట్లను చలామణి చేసినట్లు గుంటూరు పోలీసులు కనుగొన్నారు. ఏడుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసి వారివద్దనుంచి 45 లక్షల నకిలీ కరెన్సీ సీజ్ చేశామని గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ చెప్పారు.
Also Read : Vangaveeti Radha : నన్ను చంపటానికి రెక్కీ నిర్వహించారు- వంగవీటి రాధా సంచలన ఆరోపణలు
ఈజీ మనీ కోసమే.. ముఠా దొంగ నోట్లను ప్రింట్ చేసినట్లు విచారణలో తేల్చారు పోలీసులు. ముగ్గురు ప్రధాన నిందితులు ముఠాను నడిపించారని.. అందులో ఒకరిపై గతంలో నకిలీ నోట్ల విషయంలో పోలీస్ కేసు ఉందని గుంటూరు డీఎస్పీ జెస్సీ ప్రశాంతి చెప్పారు.
ప్రింట్ చేసిన నకిలీ నోట్లను జనాల్లోకి తీసుకెళ్లేందుకు పక్కాగా ప్లాన్ చేసిందీ ముఠా. ఐదు వేల రూపాయల ఒరిజనల్ నోట్లకు.. 20 వేల దొంగ నోట్లు ఇచ్చేవారని విచారణలో తేలింది. లిక్కర్ షాపులు, పెట్రోల్ బంకులు, చిన్న కిరాణా షాపులను టార్గెట్గా చేసుకుని ఈ ముఠాలు దొంగనోట్ల మార్పిడికి పాల్పడేవని పోలీసుల విచారణలో తేలింది.