ముజఫర్ పూర్ షెల్టర్ హోం కేసులో సెన్సేషనల్ ట్విస్ట్..వాళ్లంతా బతికే ఉన్నారు

  • Published By: venkaiahnaidu ,Published On : January 8, 2020 / 10:53 AM IST
ముజఫర్ పూర్ షెల్టర్ హోం కేసులో సెన్సేషనల్ ట్విస్ట్..వాళ్లంతా బతికే ఉన్నారు

బీహార్ లోని ముజఫర్ పూర్ షెల్టర్ హోమ్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. చనిపోయారని భావిస్తున్న 35మంది బాలికలు బ్రతికే ఉన్నట్లు బుధవారం(జనవరి-8,2019) ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ సుప్రీంకోర్టుకి తెలిపింది. షెల్టర్ హోమ్‌లో దొరికిన ఎముకలు హోమ్‌లోని మైనర్ బాలికలవి కావని తెలిపింది. రెండు సంవత్సరాల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముజఫర్ పూర్ షెల్టర్ హోమ్ వేధింపుల కేసు సహా బీహార్‌లోని మొత్తం 17 షెల్టర్ హోమ్ కేసుల్లోనూ దర్యాప్తు పూర్తయ్యిందని సీబీఐ కోర్టుకి తెలిపింది.

చాలా ఏళ్లుగా ముజఫర్ పూర్ షెల్టర్ హోం నిర్వహిస్తున్న బాగా రాజకీయ పరిచయాలు కలిగిన బ్రజేష్ కుమార్,అతని అనుచరులు 11మంది బాలికలను చంపి ఉండవచ్చని,షెల్టర్ హోం పరిసరాల్లో భారీ స్థాయిలో ఎముకలు స్వాధీనం చేసుకున్నట్లు గతేడాది సీబీఐ సుప్రీంకోర్టుకి తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు సీబీఐ… మొత్తం రెండు అస్థికలు లభ్యమయ్యాయనీ… కానీ అవి ఓ పురుషుడు, మరో మహిళకు సంబంధించినవని ఫోరెన్సిక్ నివేదికలో తేలిందని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఏ మైనర్ హత్యకు సంబంధించిన ఆధారాలు కనుగొనబడలేదని కోర్టుకి తెలిపారు.

సీబీఐ తరపున విచారణకు హాజరైన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ మాట్లాడుతూ…హత్య చేయబడ్డారు అని భావించిన పిల్లలు తరువాత సజీవంగా ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. బీహార్‌లోని 17 షెల్టర్ హోం కేసులను సీబీఐ దర్యాప్తు చేసిందని, వాటిలో 13 కేసుల్లో చార్జిషీట్ దాఖలు చేయగా, నాలుగు కేసుల్లో ప్రాథమిక దర్యాప్తు జరిపి, తరువాత ఆధారాలు లభించకపోవడంతో మూసివేశారని ఆయన కోర్టుకి చెప్పారు. దీంతో చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం సీబీఐ నివేదికను స్వీకరించి, దర్యాప్తు బృందంలోని ఇద్దరు అధికారులను రిలీవ్ చేసింది.
 
కాగా 2018 ఏప్రిల్‌లో బీహార్ సాంఘిక సంక్షేమ శాఖకు టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ స్టడీస్ (టీఐఎస్ఎస్) సమర్పించిన నివేదికతో ముజఫర్ పూర్ షెల్టర్ హోమ్ దారుణాలు తొలిసారి వెలుగులోకి వచ్చాయి. ఓ ఎన్జీవో నిర్వహిస్తున్న ఈ హోమ్‌లో అనేక మంది మైనర్ బాలికలపై లైంగిక, శారీరక వేధింపులు జరిగాయంటూ ఆరోపణలు వచ్చాయి. ఓ బాలికను చంపి పాతిపెట్టినట్టు ఆరోపణలు రావడం… షెల్టర్ హోం ఆవరణలో అధికారులు ఓ అస్థి పంజరం తవ్వి తీయడం మరింత కలకలం రేపింది. దీంతో ప్రధాన నిందితుడు బ్రజేష్ ఠాగూర్ సహా మొత్తం 11 మందిపై 2018 మేలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బీహార్‌లోని మరో 16 వసతి గృహాల్లో కూడా ఇదే రీతిన బాలికలపై వేధింపులు జరిగినట్టు టీఐఎస్ఎస్ తన నివేదికలో తెలపడంతో.. సుప్రీంకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.