Gujarat: జైలు అధికారులు టిఫిన్ పెట్టడం లేదని ఒకేసారి ఏడుగురు ఖైదీల ఆత్మహత్యాయత్నం
గుజరాత్, వడోదరలోని సెంట్రల్ జైలులో అండర్ ట్రయల్ ఖైదీలు ఆత్మహత్యాయత్నం చేశారు. జైలు అధికారులు తమకు సరిగ్గా భోజనం పెట్టకపోవడంతోపాటు, లంచం డిమాండ్ చేయడం వల్లే ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది.
Gujarat: గుజరాత్లోని వడోదరలో దారుణం జరిగింది. ఏడుగురు అండర్ ట్రయల్ ఖైదీలు ఒకేసారి ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన వడోదర సెంట్రల్ జైలులో, బుధవారం సాయంత్రం జరిగింది.
Quadruplets Joy: ఒకే కాన్పులో నలుగురు పిల్లలు.. ఒడిశాలో జన్మనిచ్చిన మహిళ
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏడుగురు ఖైదీలు జైలులో అండర్ ట్రయల్ ఖైదీలుగా శిక్ష అనుభవిస్తున్నారు. ఈ ఏడుగురికి, జైలు సిబ్బందితో వివాదం ఏర్పడినట్లు తెలుస్తోంది. జైలు అధికారులు తమకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదని, టిఫిన్ కూడా పెట్టకుండా వేధిస్తున్నారని ఖైదీలు ఆరోపించినట్లు తెలుస్తోంది. రోజూ టిఫిన్ కావాలి అంటే తమకు లంచం ఇవ్వాలని అక్కడి అధికారులు డిమాండ్ చేశారు. జైలు గది దాటి బయటకు వెళ్లనివ్వడం లేదని, అందరితోపాటు సరిగ్గా భోజనం పెట్టడం లేదని ఆ ఖైదీలు చెప్పినట్లు తెలుస్తోంది. జైలు అధికారులు వేధిస్తుండటంతో ఏడుగురు ఖైదీలు ఆత్మహత్యకు యత్నించారు.
బుధవారం సాయంత్రం ఫినాయిల్, డిటర్జెంట్ లిక్విడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. సమాచారం అందుకున్న జైలు అధికారులు వారిని స్థానిక ఆస్పత్రికి చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని, బాధ్యులపై అవసరమైన చర్యలు తీసుకుంటామని డీసీపీ తెలిపారు.