చర్లపల్లి జైలుకు ప్రొఫెసర్ కాశీం
ఉస్మానియూ యూనివర్సిటీ ప్రొఫెసర్, విరసం కార్యదర్శి చింతకింది కాశీం అరెస్టుపై దాఖలైన పిటీషన్ పై విచారణ ముగిసింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ నివాసంలో ఆదివారం ఉదయం కాశీంను పోలీసులు హాజరుపరిచారు. అనంతరం ఈ పిటిషన్పై ఆయన నివాసంలోనే విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది రఘునాథ్ వాదనలు వినిపించారు. కాశీంను సంగారెడ్డి జైలు నుంచి చర్లపల్లి జైలుకు తరలించారు. అంతకు ముందు కాశీంతో ఆయన కుటుంబ సభ్యులు చీఫ్ జస్టిస్ నివాసంలో కలుసుకుని మట్లాడారు.
విచారణ అనంతరం పీటీషనర్ తరుఫు న్యాయవాది మాట్లాడుతూ.. ప్రొఫెసర్ కాశీం అరెస్ట్పై హెబియాస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసామని… కోర్టు ఆదేశాల మేరకు చీఫ్ జస్టీస్ ముందు హాజరు పరిచారని చెప్పారు. కాశీం ఇంటిపై సోదాలు చేసి అరెస్ట్ చేసిన విధానంపై వాదనలు వినిపించాము. 2016 లో నమోదైన కేసును ఇప్పటి వరకు ఎందుకు దర్యాప్తు జరపలేదని కోర్టు ప్రశ్నించింది. ఈ మధ్య కాలంలో ప్రజా సంఘాల నేతలు, మావోయిస్టు సానుభూతి పరులపై అక్రమ అరెస్ట్లకు సంబంధించిన వివరాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చాము.’ అని తెలిపారు.
కాశీం అరెస్టుకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన కౌంటర్ దాఖలు చేయాలని హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ జనవరి 24కివాయిదా వేసింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాశీంను శనివారం పోలీసులు అరెస్టు చేసి మొదట ములుగు పోలీసు స్టేషన్ కు, ఆతర్వాత గజ్వేల్ పోలీసు స్టేషన్ కు తరలించారు. అక్కడినుంచి కోర్టుకు రిమాండ్ కు తరలించారు.