Secunderabad Fire Accident : సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటన.. ఆ బిల్డింగ్లో ఒక అస్థిపంజరం లభ్యం
సికింద్రాబాద్ లో అగ్నిప్రమాదం జరిగిన బిల్డింగ్ లో ఓ మృతదేహం లభ్యమైంది. ఇంకా ఇద్దరి ఆచూకీ దొరకాల్సి ఉంది. మరోవైపు భవనంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
Secunderabad Fire Accident : సికింద్రాబాద్ లో అగ్నిప్రమాదం జరిగిన బిల్డింగ్ లో ఓ మృతదేహం లభ్యమైంది. ఇంకా ఇద్దరి ఆచూకీ దొరకాల్సి ఉంది. మరోవైపు భవనంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అటు, భవనం కూల్చివేత పనులను మూడు రోజుల పాటు వాయిదా వేశారు అధికారులు. పూర్తిగా శిథిలాలు తొలగించాలని నిర్ణయించారు. శిథిలాలు తొలగిస్తే మిగతా వారి ఆచూకీ తెలుస్తుందని అంచనా వేస్తున్నారు.
ఘటనా స్థలాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ కమిషనర్ పరిశీలించారు. ఈ నెల 25న ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తలసాని చెప్పారు. అనుమతులు లేని బిల్డింగ్ లను ఏం చేయాలి అనే దానిపై కమిటీ వేయాలన్నారు తలసాని.
రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించిన వెంటనే భవనంలో ఓ మృతదేహాన్ని గుర్తించారు. క్లూస్ టీమ్, డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు జాయింట్ గా రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నారు.
సికింద్రాబాద్ రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో డెక్కన్ స్పోర్ట్స్ వేర్ మాల్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆరంతస్తుల డెక్కన్ స్పోర్ట్స్ వేర్ భవనంలో 10 గంటలకు పైగా మంటలు ఎగసిపడ్డాయి. మూడు వైపుల నుంచి ఫైరింజన్లను మోహరించి మంటలు ఆర్పేశారు. అగ్నికీలలను అదుపులోకి తెచ్చేందుకు చాలా శ్రమించాల్సి వచ్చింది. కాగా, దట్టమైన పొగ కారణంగా పలువురు అగ్నిమాపక సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించారు.
రాంగోపాల్ పేట మినిస్టర్ రోడ్డులో ఉన్న ఆరు అంతస్తుల డెక్కన్ మాల్ భవనం అగ్నికి ఆహుతైంది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రెండు సెల్లార్లతో కూడిన జి+5 భవనంలోని డెక్కన్ స్పోర్ట్స్ నిట్వేర్ మాల్లో గురువారం(జనవరి 19) ఉదయం 10.30 గంటలకు ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి వరకూ మంటలు కొనసాగాయి. చుట్టుపక్కల సుమారు 20 భవనాలపై ప్రభావం పడింది. వందల మంది ఇళ్లు, దుకాణాలను ఖాళీ చేసి పరుగులు తీశారు. డెక్కన్ మాల్కు ఎడమవైపు ఉన్న నల్లగడ్డ బస్తీలోని 20 ఇళ్లు మంటల ధాటికి స్వల్పంగా దెబ్బతిన్నాయి.
డెక్కన్ స్పోర్ట్స్ నిట్వేర్ మాల్ అగ్నిప్రమాదం ఘటనలో సంస్థలో పనిచేసే వసీం(36), జునైద్ (32), జహీర్(22)లు కనిపించకుండా పోయారు. భవన యజమానులు మహ్మద్ ఒవైసీ, ఎంఏ రహీం తదితరుల నిర్లక్ష్యం వల్లే అగ్నిప్రమాదం జరిగిందని పోలీసులు స్పష్టం చేశారు.
ఓ సెల్లార్లో స్పోర్ట్స్ డ్రెస్ ల తయారీ యూనిట్ ఉంది. మరో సెల్లార్లో కార్ల డెకరేషన్ దుకాణం నడుస్తోంది. టన్నుల కొద్దీ దుస్తులను యజమాని గ్రౌండ్ ఫ్లోర్లో ఉంచి అమ్ముతున్నారు. ఒకటి, రెండు అంతస్తులను వస్త్ర గోడౌన్ గా ఉపయోగిస్తున్నారు. 3వ అంతస్తును ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. 4, 5 అంతస్తులను నివాసంగా వాడుకునేందుకు ఇటీవల పనులు చేపట్టారు. సెల్లార్లోని వస్త్రాల తయారీ కేంద్రంలో మంటలు చెలరేగి ఉండొచ్చని పోలీసుల ప్రాథమిక అంచనా.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్ కోసం 10TV చూడండి.
మొత్తం 29 ఫైరింజన్ల సాయంతో మంటలను అతి కష్టమ్మీద అదుపులోకి తెచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లలో వ్యాపారం నిర్వహించడంతో పాటు పార్కింగ్ స్థలంలో కార్ల అలంకరణ సామగ్రి, దుస్తుల కార్టన్లను పేర్చారు. ఈ బిల్డింగ్ లో అగ్నిప్రమాదం జరిగితే తప్పించుకునే మార్గాలే లేవని పోలీసుల విచారణలో బయటపడింది.