కరోనాను ఖతం చేసే ఆయుధం.. సక్సెస్ అయితే అక్టోబర్‌లోనే వ్యాక్సిన్!

  • Published By: sreehari ,Published On : July 28, 2020 / 10:10 PM IST
కరోనాను ఖతం చేసే ఆయుధం.. సక్సెస్ అయితే అక్టోబర్‌లోనే వ్యాక్సిన్!

ప్రపంచం మొత్తాన్ని ఒక వైరస్ గజగజలాడిస్తోంది. దేశ ప్రజల గుండెల్లో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఇంకా ఏదైనా ఆశ ఉందంటే.. అది కచ్చితంగా వ్యాక్సినే. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వ్యాక్సిన్ ట్రయల్స్.. ఫైనల్ స్టేజ్‌కి చేరడంతో.. అతి త్వరలో కరోనాను గెలిచేస్తామన్న ఆశలు చిగురిస్తున్నాయ్. కరోనాను ఖతం చేయాలన్నా.. ఈ సంక్షోభం నుంచి బయటపడాలన్నా.. ఈ విపత్కర పరిస్థితులను గెలవాలన్నా.. వీటన్నింటికి కావాల్సింది ఒక్కటే. దాని పేరే కోవిడ్ వ్యాక్సిన్. జనరల్‌గా ఒక వ్యాక్సిన్ తయారుచేయాలంటే.. సంవత్సరాలు పడుతుంది.



కానీ.. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న కరోనా సంక్షోభంతో సైంటిస్టులు కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. ఒక మహమ్మారిని ఎదుర్కోవాలంటే.. దానికి ఉన్న ఒకే ఒక్క హోప్ వ్యాక్సినేషన్ మాత్రమే. అందుకే.. శాస్త్రవేత్తలు చాలా తక్కువ సమయంలోనే.. టీకాను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 2019 డిసెంబర్‌లో కరోనా వైరస్ బయటపడితే.. సైంటిస్టులు జనవరిలోనే వ్యాక్సినేషన్‌పై ప్రయోగాలు మొదలుపెట్టేశారు. కేవలం.. 65 రోజుల్లోనే అమెరికాకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్.. మనుషులపై వ్యాక్సిన్ ట్రయల్ చేసింది.

ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనాకు.. వ్యాక్సిన్ తెచ్చేందుకు ప్రపంచదేశాలన్నీ పోటీపడుతున్నాయ్. కానీ.. వ్యాక్సిన్ రేసులో అమెరికాకు చెందిన మోడెర్నా బయోటెక్ ఆశలు పెంచింది. కోవిడ్-19 టీకా మూడో దశ ప్రయోగాన్ని.. 30 వేల మంది వాలంటీర్లతో ప్రారంభించింది.



వ్యాక్సిన్ భద్రతతో పాటు వైరస్‌ను అడ్డుకునే అంశాలను కూడా ఈ ఫైనల్ స్టేజ్‌లోనే నిర్ధారించనున్నారు. ఈ లాస్ట్ ట్రయల్ గనక సక్సెస్ అయితే.. ఈ ఏడాది చివరి నాటికే.. మహమ్మారి కరోనాకు వ్యాక్సినే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు.

84 ప్రాంతాల్లో.. మోడెర్నా వ్యాక్సిన్ ట్రయల్స్ :
అమెరికాకు చెందిన మోడెర్నా బయోటెక్.. ఫస్ట్, సెకండ్ ఫేజ్‌లో మంచి ఫలితాలు సాధించింది. మూడో దశ ప్రయోగాల్లో భాగంగా.. 30 వేల మంది వాలంటీర్లకు టీకా ఇస్తున్నారు. అమెరికా వ్యాప్తంగా 84 ప్రాంతాల్లో.. మోడెర్నా వ్యాక్సిన్ ట్రయల్స్ చేపట్టింది. వీరిలో కొందరికి నిజమైన రియల్ షాట్, మరికొందరికి డమ్మీ షాట్ ఇస్తారు. రెండు డోసుల తర్వాత.. సైంటిస్టులు ఈ వాలంటీర్లను ట్రాక్ చేస్తూ ఉంటారు.



వ్యాక్సిన్ సమర్ధవంతంగా పనిచేస్తే.. ప్రయోగాలు పూర్తయ్యే నాటికి.. మోడెర్నా దగ్గర లక్షల డోసుల వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని.. యూఎస్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్ తెలిపారు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే.. అక్టోబర్ ఆరంభంలోనే అధికారిక అనుమతులు పొందేందుకు చర్యలు చేపట్టే అవకాశముంది.

అమెరికాలో 50 లక్షల మందికి.. ఒక్కొక్కరికీ రెండు డోసుల చొప్పున వ్యాక్సిన్‌ అందించేందుకు.. ఇప్పటికే ఫైజర్‌ అనే ఫార్మా కంపెనీ హక్కులు పొందింది. 2021 చివరి నాటికి 1.3 బిలియన్‌ డోసుల ఉత్పత్తిని టార్గెట్‌గా పెట్టుకుంది. మోడెర్నా ఏడాదికి బిలియన్‌ డోసుల తయారీని లక్ష్యంగా నిర్దేశించుకుంది. టీకా అభివృద్ధికి తోడ్పడటానికి.. బయోమెడికల్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ.. మోడెర్నాకు అదనంగా 472 మిలియన్ డాలర్లు ప్రకటించింది.



రోగనిరోధక శక్తిని పెంచింది :
ప్రయోగ దశలో ఉన్న తమ టీకా.. ప్రైమరీ క్లినికల్‌ ట్రయల్స్‌లో మంచి ఫలితాలిచ్చినట్లు మోడెర్నా బయోటెక్ తెలిపింది. తొలిదశలో 45 మంది వాలంటీర్లకు ఇచ్చిన వ్యాక్సిన్‌తో.. కరోనాపై పోరాడే రోగనిరోధక శక్తి ఏర్పడినట్లు గుర్తించామని వెల్లడించింది. అలాగే.. తమ టీకా కూడా సురక్షితమైందేనని ప్రాథమికంగా నిర్ధారణ అయినట్లు తెలిపింది.

రెండు డోసుల వ్యాక్సిన్‌ అందుకున్న వారిలో.. కరోనా వైరస్‌ను అంతం చేయగలిగే యాంటీబాడీస్‌ భారీ స్థాయిలో విడుదలైనట్లు మోడెర్నా చెబుతోంది. కొవిడ్‌-19 నుంచి కోలుకున్నవారిలో కంటే వ్యాక్సిన్ ఇచ్చిన వారిలోనే ఎక్కువ యాంటీబాడీస్ ఏర్పడ్డాయని తెలిపింది.



మోడెర్నా ప్రయోగాలపై అమెరికాలోని వైద్యనిపుణులు కూడా నమ్మకంగా ఉన్నారు. ప్రాథమిక ఫలితాలు పరిశీలించాక.. వ్యాక్సిన్ భద్రతపై నమ్మకం వ్యక్తం చేశారు. టీకా ప్రయోగాల ఫలితాలు.. నవంబరు చివరి నాటికి గానీ.. అంతకంటే ముందు గానీ వచ్చే అవకాశం ఉందంటున్నారు. వ్యాక్సిన్ డెవలప్‌మెంట్‌లో.. ఇప్పటివరకు ఉన్న వ్యాక్సిన్ల తయారీ టెక్నాలజీకి భిన్నమైన విధానాన్ని అవలంభిస్తున్నారు.

ఈ కొత్త పద్ధతిలో.. అత్యంత వేగంగా టీకాను ఉత్పత్తి చేయొచ్చని.. మోడెర్నా బయోటెక్ గతంలోనే తెలిపింది. MRNA -1273గా వ్యాక్సిన్‌ను పేరు పెట్టారు. ఇది.. కరోనాను ఎదుర్కొనేలా.. ఇమ్యూనిటీ సిస్టమ్‌ను రెడీ చేస్తుంది. ఈ ఫేజ్-3 వ్యాక్సిన్ ట్రయల్స్ సక్సెస్ అయితే.. అక్టోబర్ ఆరంభంలోనే అధికారిక అనుమతులు పొందేందుకు మోడెర్నా బయోటెక్ చర్యలు చేపట్టే అవకాశముంది.



ఇండియాలో ఫేజ్-3 వ్యాక్సిన్ ట్రయల్స్‌ రెడీ :
ఇదిలా ఉంటే.. ఇండియాలో కూడా ఫేజ్-3 వ్యాక్సిన్ ట్రయల్స్‌కి రంగం సిద్ధమైంది. బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫోర్డ్ యూనివర్సిటీ కూడా వ్యాక్సిన్‌ని డెవలప్ చేసింది. ఇది కూడా.. ఫస్ట్, సెకండ్ స్టేజ్ ప్రయోగాలను సక్సెస్‌ఫుల్‌గా దాటుకొని వచ్చింది. ఆ టీకాకు సంబంధించిన మూడో దశ ప్రయోగాలను.. దేశంలో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా చేపట్టనుంది. ఈ మేరకు.. డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ భారత్‌లోని 5 ప్రాంతాల్లో ఫైనల్ ఫేజ్ ట్రయల్స్‌ నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది.

ఇండియాలో ఆక్స్‌ఫోర్డ్ టీకాను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు.. ఫేజ్-3 ప్రయోగానికి సంబంధించిన డేటా ఎంతగానో ఉపయోగపడుతుందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ సెక్రటరీ చెప్పారు. ఫైనల్ ట్రయల్స్ నిర్వహించేందుకు.. దేశంలోని ఐదు ప్రాంతాలను సెలెక్ట్ చేసినట్లు తెలిపారు. మరికొద్ది రోజుల్లోనే.. భారత్‌లో ఆక్స్‌ఫోర్డ్ టీకాకు సంబంధించిన చివరిదశ ట్రయల్స్‌.. ప్రారంభం కానున్నాయి.