భారత స్వాతంత్ర్య పోరాటంలో వీర నారీమణులు

  • Published By: nagamani ,Published On : August 14, 2020 / 11:55 AM IST
భారత స్వాతంత్ర్య పోరాటంలో వీర నారీమణులు

భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో పోరాటం చేశారు. తమ పోరాట పటిమను, తెగువను చూపించారు. భారత స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించారు. ప్రాణత్యాగం చేశారు. ఎందరో మహానుభావులు.. వాళ్లు ప్రాణత్యాగం చేసి భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకొస్తే.. ఇప్పుడు మనం హాయిగా బతుకుతున్నాం. మీకు ఎంతరో స్వాతంత్ర్య సమరయోధులు తెలిసి ఉండొచ్చు. కానీ.. ఈ భారత మహిళలు కూడా స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ల పోరాట పటిమ తెలుసా? మహిళలు అయినప్పటికీ తెగించి బ్రిటీషర్లతో పోరాడారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో భాగస్వాములయ్యారు.

Dhurga Bhi

దుర్గాబాయి దేశ్‌ముఖ్
భారత స్వాతంత్ర్య సమర యోధురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి, న్యాయవాది, సామాజిక కార్యకర్త . చెన్నై, హైదరాబాదులలో ఉన్న ఆంధ్ర మహిళా సభలను స్థాపించి మహిళా చైతన్యానికి మారుపేరుగా నిలిచారు. మహిళా సాధికారత కోసం ఎంతగానో కృషి చేశారు. భారతదేశం రాజ్యాంగ సభ, ప్రణాళికా సంఘ సభ్యురాలు. భారతదేశంలో సామాజిక సర్వీస్ మదర్ గా దుర్గాభాయిని పిలిచేవారు. ఆమె నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఉమెన్ ఎడ్యుకేషన్ కు మొదటి చైర్‌మన్ గా వ్యవహరించింది. దుర్గాభాయి దేశ్ ముఖ్ దేశం కోసం మహిళల కోసం చేసిన సేవల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

‘భికాజీ రుస్తుం కామా’
భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన పార్సీ వనిత. ఈమె స్వాతంత్ర్య సమరయోధులు మాత్రమే కాదు, లింగ అసమానతలను నిర్మూలించడానికి తన జీవితకాలమంతా పోరాడిన యోధురాలు కూడా. 1906 లో, జర్మనీలోని స్టుట్‌గార్ట్‌లో జరిగిన అంతర్జాతీయ సోషలిస్ట్ సమావేశంలో ఆమె భారత జెండాను ఎగురవేసిన ధీశాలి భాకాజీ కామా.

1896లో బొంబాయిలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. రోగగ్రస్తులకు సేవలు చేస్తున్న ఆమెకు కూడా ప్లేగు వ్యాధి సోకింది.1901 చికిత్స కోసం ఇంగ్లండ్ కు వెళ్లారామె. అక్కడున్న భారత స్వాతంత్ర్యోద్యమ కర్త శాంయజీ కృష్ణవర్మ చేత ప్రభావితమై, 1905 లో దాదాభాయ్ నౌరోజీ కి సహాయకురాలిగా ఇండియన్ హోం రూల్ సొసైటీని స్థాపించింది. బ్రిటన్ వ్యతిరేక చర్యలు చేయనని హామీ ఇస్తే గాని, ఇండియాకు వెళ్ళనీయనంది బ్రీటీష్ ప్రభుత్వం. దీంతో భికాజీ ఇంగ్లండ్ వదలి పారిస్ నగరంలో నివాసం ఏర్పరచుకుంది. 1907 ఆగష్టులో జర్మనీలోని స్టుట్ గార్ నగరంలో జరిగిన అంతర్జాతీయ సోషలిస్ట్ కాన్ఫరెన్స్ కు వెళ్ళి మనదేశ స్వాతంత్ర్యం కోసం వారి మద్దతు కోరింది.

మనదేశానికొక పతాకం ఉండాలని, దామోదర్ వినాయక్ సావర్కర్ తో కలసి ఒక త్రివర్ణ పతాకాన్ని తయారుచేసి ఆ సమావేశంలో ప్రదర్శించింది. ప్రస్తుత మన జాతీయ పతాకానికి ప్రథమ రూపం భికాజీ కృషే. మొదటి ప్రపంచ యుద్ధంలో మిత్రులైన బ్రిటిష్ ప్రభుత్వం యొక్క బలవంతాన, భికాజీ ఫ్రాన్స్ లో నిర్భంధించబడింది. యుద్ధానంతరం ఫ్రాన్స్ లోనే యుండి, మన స్వాతంత్ర్యం కోసం వ్యాసాలు వ్రాస్తూ, ప్రసంగాలు చేస్తుండేది. 1935 తీవ్రమైన అస్వస్థతకు గురై, భారతదేశం తిరిగివచ్చి 1936లో మరణించింది. తన యావదాస్తిని ఆవాబాయి పెటిట్ అనాథ శరణాలయానికి దానం చేసిన మహోన్నతురాలు భికాజీ కామా.ఇంతటి గొప్ప దేశ భక్తురాలి గుర్తుగా ఆమె జన్మ శతాబ్ది సందర్భంగా 1962 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఒక తపాలా బిళ్ళను విడుదల చేసింది. 1997 సంవత్సరంలో మన కోస్ట్ గార్డ్ లోని అతివేగపు గస్తీ నౌకను ఆమె పేరు పెట్టారు.

అనిబిసెంట్
బ్రిటిష్ సామ్యవాది, బ్రహ్మ జ్ఞానవాది, మహిళాహక్కుల ఉద్యమవాది, రచయిత. ఆమె వాక్పటిమ కలిగిన స్త్రీ అనిబిసెంట్. అనీ వుడ్ బిసెంట్ ఐరిష్ జాతి మహిళ. లండను లోని క్లఫామ్ లో, 1847 అక్టోబరు 1 న జన్మించింది. 1933 సెప్టెంబరు 20 న తమిళనాడు లోని అడయారులో మరణించింది. ఈమె దివ్యజ్ఞాన తత్వజ్ఞి, మహిళల హక్కుల ఉద్యమకారిణి, రచయిత్రి, మంచి వక్త. ఈమె ఐర్లాండ్, భారతదేశాల స్వాతంత్ర్యం, స్వయంపాలన కొరకు పోరాడి…స్వయం పాలన ఉద్యమం స్థాపించిన మహోన్నత త్యాగశీలి.

1867 డిసెంబరులో తన 19 వ ఏట, తల్లి కోరికమేరకు ఫాదర్ ఫ్రాంక్ బిసెంట్ ని అనిబిసెంట్ పెళ్ళి చేసుకుంది. అంతవరకూ అనీగా పిలవబడిన ఆమె వివాహంతో అనీ బిసెంట్ గా మారింది. ఈమె 1874 లో ఇంగ్లాడులోని నేషనల్ సెక్యులర్ సొసైటీ అనే సంస్థలో చేరింది. లా అండ్ రిపబ్లిక్ లీగ్ ని స్థాపించి పోలీసు అత్యాచారాలకు బలైన కుటుంబాలకు సేవచేసింది. వారికోసం పోరాడింది.

అనిబిసెంట్ ఐరిష్ మహిళ, థియోసాఫికల్ సొసైటీ ఆఫ్ ఇండియాకు నాయకురాలు. ఆమె భారత జాతీయ కాంగ్రెస్ మొదటి మహిళ అధ్యక్షురాలిగా పనిచేశారు. 1906లో ఇండియన్ హోమ్ రూల్ లీగ్ ను ఆమె స్థాపించారు. ఆ సమయంలోనే భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఆమె చేసిన సేవల గురించి..ఆమె ప్రతిభాపాటవాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

సరోజినీ నాయుడు
భారత కోకిలగా పేరొందిన సరోజినీ నాయుడుకు ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధురాలు, కవయిత్రి. అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహా సభలకు తొలి మహిళా అధ్యక్షురాలు, స్వతంత్ర భారత తొలి మహిళా గవర్నర్ కూడా. 1879 ఫిబ్రవరి 13న హైదరాబాద్ లో బెంగాళీ బ్రాహ్మణ కుటుంబంలో ఆమె జన్మించారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో ఆమె పాత్ర మరువలేనిది. క్విట్ ఇండియా ఉద్యమంలోనూ ఆమె పాత్ర చాలా కీలకం.

ఝాన్సీ రాణీ లక్ష్మీబాయి
ఝాన్సీ రాణి లక్ష్మీబాయి..ఈమె అసలు పేరు మణికర్ణిక. ఝాన్సీ రాజు బాజీరావు పీష్వా ను వివాహం చేసుకుంది. అతని మరణం తరువాత ఝాన్సీ రాజ్యానికి రాణి అయిన ఆమె పలు యుద్ధాల్లో ఆరితేరింది. దీంతో ఆమెను ఝాన్సీరాణిగా పేరొందింది. ఈమె ధైర్యానికి మారు పేరు. ఆమె కత్తి పట్టి కథనరంగంలోకి దూకిందంటే శతృవుల వెన్ను వణకాల్సిందే. ఉత్తర భారతదేశంలోని ఝాన్సీ రాజ్యానికి రాణి. 1857లో జరిగిన భారతదేశ తిరుగుబాటులో ఆమె ప్రముఖ పాత్ర పోషించారు. ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామం అది. ఆ తర్వాత అనేక సార్లు బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాడి ఝాన్సీ రాణి చరిత్రకెక్కారు. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించి అత్యంత ధైర్యసాహసాలు కలిగిన వీర వనితగా చరిత్రలో నిలిచిపోయారు.

సుచేతా కృపలానీ
స్వాతంత్ర్య సమరయోధురాలు, మహిళా రాజకీయవేత్త, ఉత్తర ప్రదేశ్ కు మొదటి మహిళా ముఖ్యమంత్రి. సుచేతా కృపలానీ హర్యానాలోని అంబాలాలో ఓ బెంగాలీ కుటుంబంలో జన్మించారు. భారత జాతీయ కాంగ్రెస్ కార్యకలాపాల్లో సుచేతా చురుకుగా పాల్గొనేవారు. క్విట్ ఉద్యమంలోనూ సుచేతా కృపలానీ చురుకుగా పాల్గొన్నారు. ఆ తర్వాత మహాత్మా గాంధీతో కలిసి పనిచేశారు.

అరుణ అసఫ్ అలీ
అరుణ అసఫ్ అలీ భారత స్వాతంత్ర్య ఉద్యమ పోరాట యోధుడు మరియు సామాజిక కార్యకర్త కూడా. 1942లో గాంధీజీ జైలుకెళ్ళినపుడు క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించిన మహిళ. క్విట్ ఇండియా ఉద్యమకాలంలో బొంబాయిలోని గవాలియా టాంకు మైదానంలో భారత జాతీయపతాకాన్ని ఎగురవేసిన మహిళగా చిరస్మరణీయురాలు. ఢిల్లీ నగరానికి మెట్టమొదటి మేయర్. ఈమెకు మరణానంతరం భారతరత్న అవార్డు లభించింది.అరుణా గంగూలీ, హర్యానాలోని కాల్కాలో ఒక బెంగాళీ బ్రహ్మసమాజ కుటుంబంలో జన్మించింది. ఈమె విద్యాభ్యాసం లాహోరు, నైనీతాల్ లలో జరిగింది. చదువు పూర్తయిన తర్వాత ఉపాధ్యాయురాలిగా పనిచేయటమంటే దేశంలోని ఆనాటి పరిస్థితుల్లో ఒక మహిళకు గొప్ప ఘనతే. అరుణకు భారత జాతీయ కాంగ్రెసు నాయకుడైన అసఫ్ అలీతో అలహాబాదులో పరిచయమేర్పడి ఆ పరిచయం పెళ్ళికి దారితీసింది. వారి మతాల వేరు కావటంత వారి పెళ్లికి అరుణ తల్లిదండ్రులు ఒప్పకోలేదు. (అరుణ హిందూవు అసఫ్ అలీ ముస్లిం), అంతేకాదు ఇద్దరికీ వయసులో 20 ఏళ్ళకి పైనే తేడా ఉంది. వీటన్నించి పట్టించుకోని అరుణ 1928లో అసఫ్ అలీని వివాహమాడింది.

ఇలా స్వాతంత్ర్య సమరభేరిలో సమయోచితంగా పోరాడిన మహిళా మణులుఎందరో ఎందరెందరో ఉన్నారు. కమలాదేవి ఛటర్జీ, అవిరాణి వాస్తవ, కమలానెహ్రూ. ‘గాంధీబురి’గా పేరు గాంచిన మాతంగిని హజ్రా. ఒరిస్సాకు చెందిన మధర్ థెరిస్సాగా పేరొందిన ప్రభిత గిరి,1857 నాట గొప్ప తిరుగుబాటుదారులలో ముఖ్య పాత్ర వహించిన ముస్లిం మహిళ ‘బేగం హజ్రత్ మహల్.

1942 లో క్విట్ ఇండియా ఉద్యమంలో గర్వంగా జాతీయ జెండాను మోసినందుకు కాల్చి చంపేసి అస్సాంకు తొలి మహిళా అమరవీరులు కనక్లతా బారువా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రసంగాలకు ప్రభావితురాలై స్వాతంత్ర్యోద్యమంలో ‘ఆజాద్ హింద్ ఫౌజ్ ’ మహిళాదళాల్లో చేరి..క్యాప్టెన్ హోదా పొందిన కాన్ఫూర్ వాసి లక్ష్మీసెహగల్.

దేశం కోసం అన్నీ వదులుకుని 1921 లో గాంధీ స్ఫూర్తితో జంకీదేవి బజాజ్ ఇంటి లోపల.. వెలుపల వాడుతున్న విదేశీ దుస్తులను తగలబెట్టిన ధీశాలి జానకీదేవి బజాజ్. 16 ఏళ్ల వయస్సులో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న ధైర్యశాలి బీహార్ కు చెందిన తార్కేశ్వరి సిన్హా, అక్షరాలనే ఆయుధాలుగా కవితలతో స్వాతంత్ర్య సంగ్రామంలో పోరాట పటిమను రాజేసిన అక్షరశిల్పి కుంతల కుమారి సబత్, క్విట్ ఇండియా ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొని జైలుజీవితాలన్ని అనుభవించిన అన్నపూర్ణ మహారాణా ఇలా ఎంతోమంది వీరవనితలు దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో పోరాడారు.

చరిత్రలో నిలిచిపోయారు. అంతేకాదు చరిత్రలోకి రాని ఎంతో మంది మహిళా మణులు తమ ప్రాణాలను దేశం కోసం అర్పించారు. ఆడవాళ్లు గడపదాటి బైటకు రాకూడదనే ఆంక్షలున్నా ఆరోజుల్లో దేశం కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన మహామహోన్నత మూర్తులుగా చరిత్రలో నిలిచిపోయారు.