China-Taiwan War : హోటల్ రూమ్ లో తైవాన్ రక్షణా అధికారి అనుమానాస్పద మృతి..చైనా పనేనా..?

తైవాన్, చైనా మధ్య ఉద్రికత్తలు తీవ్ర రూపు దాల్చుతున్నాయి. \ఏ క్షణమైనా చైనా తైవాన్ పై దాడులు చేసే పరస్థితులు నెలకొన్నాయి. యుద్ధ నౌకలు, ట్యాంకులు, విమానాల మోహరింపుతో ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. ఈక్రమంలో తైవాన్‌ రక్షణరంగానికి చెందిన ఓ సీనియర్ అధికారి అనుమానాస్పద స్థితిలో మరణించారు. చైనా దాడుల్లోనే తమ అధికారి చనిపోయారని తైవాన్ ఆరోపిస్తోంది.

China-Taiwan War : హోటల్ రూమ్ లో తైవాన్ రక్షణా అధికారి అనుమానాస్పద మృతి..చైనా పనేనా..?

Amid China-Taiwan tensions, Taiwanese defense official died mysteriously.. in hotel room

China-taiwan war : తైవాన్, చైనా మధ్య ఉద్రికత్తలు తీవ్ర రూపు దాల్చుతున్నాయి. యుద్ధ నౌకలు, ట్యాంకులు, విమానాల మోహరింపుతో ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. రష్యా, యుక్రెయిన్ యుద్ధంతో ఇప్పటికే అల్లాడుతున్న ప్రపంచంపై మరో యుద్ధభారం పడక తప్పని పరిస్థితులు నెలకొంటున్నాయి. తైవాన్‌ రక్షణరంగానికి చెందిన ఓ సీనియర్ అధికారి అనుమానాస్పద స్థితిలో మరణించారు. చైనా దాడుల్లోనే తమ అధికారి చనిపోయారని తైవాన్ ఆరోపిస్తోంటే డ్రాగన్ మాత్రం ఇంకా స్పందించలేదు. తమ భూభాగంపై దాడికి చైనా ప్రయత్నిస్తోందని తైవాన్ ఆరోపిస్తోంది. చైనాను ఎదుర్కొనేందుకు తైవాన్ ప్రపంచ దేశాల సాయం కోరింది.

తైవాన్, చైనా మధ్య పరిస్థితులు అంతకంతకూ దిగజారుతున్నాయి. అమెరికా స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటనను వ్యతిరేకిస్తూ…తైవాన్‌పై బెదిరింపులకు దిగిన చైనా…ద్వీపదేశాన్ని మరింత భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నిస్తోంది. నాలుగురోజల పాటు మిలటరీ ఎక్సర్‌సైజ్ నిర్వహించిన చైనా క్షిపణులు ప్రయోగాలు, యుద్ధనౌకల మోహరింపుతో ఉద్రిక్తతలను అంతకంతకూ పెంచుతోంది. ఈ పరిస్థితుల్లో మరో కీలకపరిణామం చోటుచేసుకుంది. తైవాన్ క్షిపణి అభివృద్ధి ప్రాజెక్టులను పర్యవేక్షించే ఔ యంగ్ అనే అనే ఓ అధికారి హోటల్ గదిలో శవమై కనిపించారు. బిజినెస్ ట్రిప్‌లో ఉన్న ఆయన దక్షిణ తైవాన్‌లోని ఓ హోటల్ గదిలో చనిపోయారు. నేషనల్ చుంగ్-షాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ సైన్స్ అండ్ టెక్నాలజీ డిప్యూటీ హెడ్‌గా ఉన్నారు. చైనానే ఈ దురాగతానికి ఒడిగట్టిందని తైవాన్ నమ్ముతోంది. తైవాన్ ప్రజల్లో భయాన్ని పెంచేందుకు చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ కుట్రపూరింతంగా యంగ్‌ను చంపిందని భావిస్తోంది. అసలు యంగ్ ఎలా మరణించారన్నదానిపై దర్యాప్తు జరుపుతోంది.

తైవాన్‌ను అన్నివైపుల నుంచీ ముట్టడించేందుకు చైనా సన్నాహాలు చేస్తోంది. నాలుగురోజుల పాటు మిలటరీ ఎక్సర్‌సైజ్ నిర్వహించింది. బాలిస్టిక్ మిసైళ్లు ప్రయోగించింది. అమెరికాతో తైవాన్‌ కమ్యూనికేషన్‌ లింక్‌లను ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తోంది. తైవాన్‌పై ఆర్థిక ఆంక్షలు విధించింది. ఆ దేశం నుంచి పళ్లు, ఇతర ఆహార పదార్థాల దిగుమతులు నిలిపివేసింది. తైవాన్ సరిహద్దుల్లో చైనా మిలటరీ డ్రిల్స్ నిర్వహిస్తుండడంతో యుద్ధం తప్పదన్న అంచనాలు వెలువడుతున్నాయి. తైవాన్‌ కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. భారీగా యుద్ధనౌకలను, యుద్ధవిమానాలను సిద్ధం చేసుకుంటోంది. చైనా తమపై దాడికి ప్రయత్నిస్తోందని, ప్రపంచ దేశాలు స్పందించాలని కోరింది. ప్రస్తుత ఉద్రిక్తతలకు కారణమైన అమెరికా తైవాన్‌కు అన్ని విధాలుగా అండదండగా ఉంటోంది. ఇప్పటికే అమెరికా యుద్ధవిమానాలు తైవాన్‌కు బయలుదేరాయి.

తైవాన్ జలసంధిలో చైనా, తైవాన్‌కు చెందిన 10 యుద్ధనౌకలు అతిసమీపంగా వచ్చాయి. కొన్ని చైనా నౌకలు తైవాన్ జలాల్లోకి ప్రవేశించాయి. మిలటరీ డ్రిల్స్‌లో భాగంగా చైనా భారీగా యుద్ధవిమానాలు, నౌకలు మోహరించినట్టు గుర్తించామని తైవాన్ తెలిపింది. చైనా, కొరియన్ పెవిన్సులా మధ్య సముద్రంలో లైవ్ ఫైర్ డ్రిల్ నిర్వహిస్తోంది. మిలటరీ డ్రిల్స్ వీడియోలను చైనా అధికారిక మీడియాలో ప్రసారం చేసుకుంటోంది. తైవాన్‌పై దాడికి చైనా సన్నాహాలు చేసుకుంటోందన్న వార్తలను డ్రాగన్ రక్షణమంత్రి తోసిపుచ్చారు. కానీ మిలటరీ డ్రిల్స్ నిర్వహణకు కారణాలు వెల్లడించలేదు.

నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటనను అడ్డుకునేందుకు చైనా చివరిక్షణం వరకు ప్రయత్నించింది. బెదిరింపులకు, హెచ్చరికలకు దిగింది. అయితే అటు తైవాన్ కానీ, ఇటు నాన్సీ పెలోసీ కానీ ఈ విషయంలో వెనక్కి తగ్గలేదు. ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారమే నాన్సీ తైవాన్‌లో పర్యటించారు. ఇది చైనా ఆలోచనలను పూర్తిగా మార్చేసింది. తైవాన్‌ తమ భూభాగమే…అని ఏదో ఒకరోజు తైవాన్‌ను తమలో కలుపుకుంటామని చెబుతున్న చైనా….ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించేందుకు అన్ని శక్తులూ సిద్ధం చేసుకుంటోంది. అసలు రష్యా, యుక్రెయిన్ యుద్ధం కన్నా ముందు గత ఏడాదే చైనా, తైవాన్ మధ్య యుద్ధం వచ్చే పరిస్థితులు కనిపించాయి. కమ్యూనిస్టు పార్టీ ఉత్సవాల్లో జిన్ పింగ్ తైవాన్‌ ఆక్రమణ గురించి మాట్లాడారు. చైనా యుద్ధవిమానాలు తైవాన్ గగనతలంలో మోహరించారు. కానీ ఎందుకనో అప్పుడు చైనా వెనక్కి తగ్గింది. రష్యా, యుక్రెయిన్ యుద్ధం తర్వాత తైవాన్ విషయంలో చైనా ఇప్పుడప్పుడే ఏ చర్యకూ దిగకపోవచ్చని అంతా భావించారు. కానీ నాన్సీ పెలోసీ అమెరికా పర్యటనతో మొత్తం మారిపోయింది.

అగ్రదేశంగా గుర్తింపు పొందేందుకు అమెరికాతో పోటీపడుతున్న చైనాను ఏదో విధంగా నిలవరించాలన్నది అమెరికా ఆలోచన. 20 ఏళ్ల తర్వాత అప్ఘానిస్తాన్‌లో రిక్తహస్తాలతో వెనుతిరగడం ద్వారా అంతర్జాతీయ సమాజంలో పోగొట్టుకున్న పరువును మళ్లీ పొందాలని అమెరికా ఎప్పటినుంచో భావిస్తోంది. ఇక తాలిబన్లకు చైనా, రష్యా సహాయసహకారాలు పూర్తిగా ఉన్నాయన్నది అమెరికా అనుమానం. రష్యా, యుక్రెయిన్ యుద్ధం అనుకున్నంత తొందరగా ముగియకపోవడం, యుక్రెయిన్ ఊహించినదానికన్నా ఎక్కువగానే ప్రతిఘటిస్తుండడం గమనించిన అమెరికా..చైనాను రెచ్చగొట్టేందుకే సిద్ధమయింది. తైవాన్ తమ దేశమని చైనా చెప్పుకుంటోంటే…అక్కడ పర్యటించడం ద్వారా అనధికారికంగా ఆ దేశాన్ని అమెరికా గుర్తించినట్టయింది. తైవాన్‌ను అడ్డుపెట్టుకుని చైనాపై తామే పై చేయి సాధించినట్టు చూపించాలన్నది అమెరికా ఉద్దేశం. అందుకే అమెరికా ఎత్తుగడ గ్రహించి..నాన్సీ పెలోసీ పర్యటనను నిలిపివేయడానికి చైనా ప్రయత్నించింది. అది సాధ్యం కాకపోవడంతో…భారీగా యుద్ధసన్నాహాలు చేస్తోంది. చైనా తైవాన్‌పై పూర్తిగా యుద్ధం ప్రారంభిస్తుందా లేక మిలటరీ డ్రిల్స్‌తో సరిపెడుతుందా అన్నది తేలాల్సి ఉంది.