India-China Standoff : 100 రాకెట్ లాంఛర్లను సరిహద్దుకి తరలించిన చైనా

చైనా మళ్లీ కవ్వింపు చర్యలకు దిగుతోంది. భారత సరిహద్దులకు భారీ ఎత్తున ఆయుధాలను తరలిస్తోంది. తాజాగా భారత సరిహద్దు వెంబడి 100 అత్యాధునిక దీర్ఘశ్రేణి రాకెట్ లాంఛర్లను చైనా మోహరించింది.

India-China Standoff : 100 రాకెట్ లాంఛర్లను సరిహద్దుకి తరలించిన చైనా

China (1)

India-China Standoff చైనా మళ్లీ కవ్వింపు చర్యలకు దిగుతోంది. భారత సరిహద్దులకు భారీ ఎత్తున ఆయుధాలను తరలిస్తోంది. తాజాగా భారత సరిహద్దు వెంబడి 100 అత్యాధునిక దీర్ఘశ్రేణి రాకెట్ లాంఛర్లను చైనా మోహరించింది. ఈ విషయాన్ని చైనా సైనిక వర్గాలు ధ్రువీకరించాయి. ఇటీవల ఇరు దేశాల మధ్య జరిగిన వివాదంపై 13వ విడత సైనిక కమాండర్ల స్థాయి చర్చలు విఫలం అయ్యాయి. ఈ నేపథ్యంలో చైనా సరిహద్దులకు భారీగా ఆయుధాలను తరలిస్తోందనే అనుమానాలు వస్తున్నాయి. కఠినమైన శీతాకాలం దగ్గరపడుతున్నందున..తమ జవాన్లు అతిశీతల వాతావరణానికి అలవాడు పడాలనే కారణంతో ఇలా చేస్తున్నట్లు చైనా చెప్పుకురావడం గమనార్హం.

చైనా ఆయుధ తరలింపును ఈస్టర్న్‌ కమాండర్‌ మనోజ్‌ పాండే కూడా ధ్రువీకరించారు. భారత్‌ కూడా తగిన ఏర్పాట్లు చేస్తోందని చెప్పారు. భారత్‌ ఇప్పటికే అత్యాధునిక ఎం777 అల్ట్రాలైట్‌ హోవిట్జర్లను సరిహద్దు తరలించింది. అమెరికా నుంచి కొనుగోలు చేసిన చినూక్‌ హెలికాప్టర్ల సాయంతో గత నెలలో ఎం777 అల్ట్రాలైట్‌ హోవిట్జర్లను సరిహద్దు తరలించింది భారత్. అయితే భారత్ వాడే ఎం777 కంటే..తాజాగా చైనా LAC వద్ద మొహరించిన 100 పీసీఎల్‌-181 లైట్‌ ట్రక్‌ మౌంటెడ్‌ హోవిట్జర్లు రెట్టింపు దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తాయని పీఎల్ఏ(చైనా ఆర్మీ) చెబుతోంది.

మరోవైపు, ఏప్రిల్‌ నెలలోనే పీసీఎల్‌-181 కంటే శక్తిమంతమైన పీసీఎల్‌-191 హోవిట్జర్లను చైనా ఆర్మీ LAC వద్దకు చేరవేసింది. ఈ విషయాన్ని అప్పట్లో చైనా ప్రభుత్వానికి చెందిన సీసీటీవీ ధ్రువీకరించింది. ఇది దాదాపు 500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలపై కూడా దాడి చేయగలదని పేర్కొంది. వేర్వేరు దూరాల్లోని లక్ష్యాలను ఛేదించడం కోసం చైనా ఆర్మీ వీటిల్లోని రకాలను మోహరిస్తున్నట్లు మకావ్‌కు చెందిన సైనిక నిపుణులు ఆంటోనీ వాంగ్‌ టాంగ్‌ తెలిపారు.

ఇక, సరిహద్దుపై దృష్టి సారించిన భారత్..సరిహద్దుల వెంట భారీ సంఖ్యలో రాడార్లు, సెన్సార్లు, కెమెరాలు, మోషన్ డిటెక్టర్లను ఏర్పాటు చేసింది. అంతేకాదు, ఉపగ్రహాల నుంచి సేకరించిన చిత్రాలను ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటోంది. దీంతో ఎల్‌ఏసీ, చైనా భూభాగంలో ఆ దేశ ఆర్మీ కదలికలను స్పష్టంగా తెలుసుకోవచ్చు. అత్యంత కీలకమైన సాఫ్ట్‌వేర్‌ను భారత్ అభివృద్ధి చేసింది. ‘ఫేస్‌ రికగ్నైజర్‌’గా పిలిచే ఈ సాఫ్ట్‌వేర్‌ను సిగ్నల్‌ కోర్‌లో మేజర్‌గా పని చేసే భవ్యా శర్మ అభివృద్ధి చేశారు. కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే ఈ సాఫ్ట్‌వేర్‌ చైనా సైనికులను గుర్తించగలదు.

చాలా కాలంగా సరిహద్దుల్లో చైనా సైనికుల కదలికలు చిత్రీకరించిన వీడియోల డేటాబేస్ వాడి దీనిని అభివృద్ధి చేశారు. వాస్తవానికి ఇటువంటి టెక్నాలజీని అరుణాచల్‌ ప్రదేశ్‌లో పూర్తిగా ప్రవేశపెట్టేందుకు కొన్నేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నా.. తాజా పరిస్థితుల నేపథ్యంలో వాస్తవాధీన రేఖ మొత్తానికి విస్తరించనున్నారు. ఇది పూర్తియితే చైనా సైనికుల కదలికలు మన దళాలకు పూర్తిగా తెలుస్తాయి. నిఘా కోసం వినియోగించే దీర్ఘశ్రేణి డ్రోన్ల విషయంలో కూడా సైన్యం కీలక మార్పులు చేసింది. ఇప్పటి వరకు ఈస్ట్రన్‌ కమాండ్‌లోని ఆర్టలరీ కోర్‌ కింద ఉన్న డ్రోన్లను ప్రస్తుతం ఆర్మీ ఏవియేషన్‌ కోర్‌ పరిధిలోకి తీసుకొచ్చారు.

ఈ సారి శీతాకాలం కూడా చైనీయులకు సవాల్ గా మారనుంది. గతేడాది లడఖ్ ప్రాంతంలో చైనా తమ దళాలను తరచూ మార్చేసింది. వారు ఏడాది కూడా అక్కడ ఉండలేకపోయారు. చాలా మంది ఈ వాతావరణం తట్టుకోలేక గాయపడటమో, అస్వస్థతకు గురికావడమో జరిగింది. వాస్తవానికి భారత్‌ కూడా అక్కడ 40 శాతం వరకు దళాలను మారుస్తుంది.

ALSO READ China’s New Law : చైనాలో కొత్త చట్టం…పిల్లలు తప్పు చేస్తే పెద్దలకు శిక్ష!