Russia Ukraine War: యుక్రెయిన్లో భారతీయులకు కీలక సూచనలు
యుక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులకు కీవ్ లోని భారత రాయబార కార్యాలయం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. భారత పౌరులు, విద్యార్థులకు
Russia Ukraine War: యుక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులకు కీవ్ లోని భారత రాయబార కార్యాలయం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. భారత పౌరులు, విద్యార్థులకు పలు కీలక సూచనలు ఇచ్చింది. యుక్రెయిన్ రాజధాని కీవ్లో వారాంతపు కర్ఫ్యూ ఎత్తివేశారని స్థానికంగా ఉంటున్న ఇండియన్స్ కు భారత ఎంబసీ తెలిసింది. భారత విద్యార్థులు రైళ్లలో పశ్చిమ ప్రాంతాలకు వెళ్లాలని ఎంబసీ సూచించింది. విద్యార్థుల తరలింపు కోసం ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్టు ఎంబసీ వెల్లడించింది.
భారతీయ పౌరులు, విద్యార్థులు ప్రశాంతంగా, శాంతియుతంగా ఐక్యంగా ఉండాలని ఎంబసీ చెప్పింది. రైల్వే స్టేషన్లలో పెద్ద సంఖ్యలో గుంపులు ఉండే అవకాశం ఉందని, భారతీయ విద్యార్థులందరూ ఓపికగా ఉండాలని కోరింది. రైల్వే స్టేషన్లలో ఉన్నప్పుడు దూకుడు ప్రవర్తన వద్దని సూచించింది. రైళ్ల షెడ్యూల్లో ఆలస్యం, రద్దు చేయడం, రద్దీ ఉంటుందని భావిస్తున్నాం అని చెప్పింది. భారతీయ విద్యార్థులు తమ పాస్పోర్ట్, తగినంత నగదు, ఆహారం, శీతాకాలపు దుస్తులు, అవసరమైన వస్తువులను మాత్రమే తీసుకువెళ్లాలని భారత ఎంబసీ కోరింది. భారత పౌరుల తరలింపు ప్రయత్నాలను సులభతరం చేయడంలో యుక్రేనియన్ పౌరులు, అధికారులు విశేషమైన మద్దతు ఇస్తున్నారని భారత ఎంబసీ వెల్లడించింది.
భారతీయులను యుక్రెయిన్ నుంచి తరలించడానికి భారత ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపట్టింది. భారతీయ విద్యార్థులు పశ్చిమ ప్రాంతాల వైపు వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు తెలిపింది. భారతీయ విద్యార్థులు ఈ ప్రత్యేక రైళ్లలో పశ్చిమ ప్రాంతాలకు చేరుకోవాలని భారత దౌత్య కార్యాలయం తెలిపింది. అక్కడి నుంచి రోడ్డు మార్గాల ద్వారా హంగేరి, పోలాండ్, రోమానియా దేశాలకు చేరుకోవచ్చు. అక్కడి నుంచి భారతీయ విద్యార్థులను ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి తీసుకొస్తారు.
వరుసగా 5వ రోజు కూడా రష్యా-యుక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. యుక్రెయిన్పై రష్యా సైన్యం దాడులు చేస్తోంది. యుక్రెయిన్లోని చెర్నిహివ్ పై గత రాత్రి మొత్తం రష్యా బాంబుల వర్షం కురిపించింది. చెర్నిహివ్లోని రెసిడెన్షియల్ భవనంపై రష్యా క్షిపణి దాడి చేసింది. దీంతో ఆ భవనంలోని రెండు అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. యుక్రెయిన్ రాజధాని కీవ్ తో పాటు ఖార్కివ్లోనూ రష్యా సేనలు దాడులు కొనసాగిస్తున్నాయి.
Russia-Ukraine War: భారత సైన్యాన్ని పంపమంటూ ఏడుస్తూ రిక్వెస్ట్!
కాగా, చెప్పిన మాట వినకుండా దాడులకు దిగిన రష్యాపై పలు దేశాలు ఇప్పటికే ఆంక్షలు విధించాయి. రష్యాపై ఒత్తిడి పెంచుతూ అనేక దేశాలు చర్యలు తీసుకుంటున్నాయి. మరోవైపు యుక్రెయిన్కు పలు దేశాలు అండగా నిలుస్తున్నాయి. క్షిపణులు, ఆయుధాలు పంపుతున్నాయి. యుక్రెయిన్కు ఈయూ నుంచి యుద్ధ విమానాలు కూడా వెళ్తున్నాయి. యుక్రెయిన్ పై రష్యా దాడులను జీ7 దేశాలు ఖండించాయి. ఉక్రెయిన్ కు అండగా ఉంటామని రక్షణ, ఆర్థిక పరంగా సాయం చేస్తామని ప్రకటించాయి.
రష్యా బలగాలను ఎదుర్కొనేందుకు యుక్రెయిన్ సైన్యం పోరాడుతోంది. పౌరులు కూడా ఆయుధాలు పట్టారు. రష్యా బలగాలను ఎదుర్కొంటున్నారు. మరోవైపు యుక్రెయిన్ నుంచి విదేశీ పౌరుల తరలింపు పక్రియ వేగంగా కొనసాగుతోంది. మొదట యుక్రెయిన్ నుంచి పొరుగు దేశాలకు రోడ్డు మార్గాల ద్వారా, ఆ తర్వాత ఆయా దేశాల నుంచి స్వదేశానికి విమానాల ద్వారా వారిని తరలిస్తున్నారు.