Turkey Earthquake : టర్కీలో మళ్లీ భారీ భూకంపం.. గంటల వ్యవధిలో రెండోసారి
టర్కీని వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. తాజాగా మరోసారి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 7.6గా నమోదైంది.(Second Powerful Earthquake Hits Turkey Hours After Over 1,600 Killed)
Turkey Earthquake : టర్కీని వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. తాజాగా మరోసారి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 7.6గా నమోదైంది. ఇప్పటికే ఈరోజు తెల్లవారుజామున 7.8 తీవ్రతతో భూకంపం సంభవించగా.. 1600 మందికిపైగా మరణించారు. ఇంకా వేలాది మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. వారిని రక్షించే ప్రయత్నాలు జరుగుతుండగానే మరోసారి భూమి కంపించింది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.
దక్షిణ టర్కీలోని కహ్రామన్మరాస్ ప్రావిన్స్లోని ఎల్బిస్తాన్ జిల్లాలో 7.6 తీవ్రతతో తాజాగా మరోసారి భూకంపం వచ్చినట్లు అధికారులు తెలిపారు.. డమాస్కస్, లటాకియా ఇతర సిరియన్ ప్రావిన్సులను తాజా భూకంపం వణికించింది. ఈరోజు తెల్లవారుజామున 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం అపారమైన ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. ఉదయం సంభవించిన భూకంపంలో 1600 మందికి పైగా మృతి చెందగా, భారీగా ఆస్తి నష్టం జరిగింది.
Also Read..Earthquake In Turkey: టర్కీ, సిరియాల్లో భూకంపం దాటికి నేల మట్టమైన భవనాలు..
భారీ భూకంపాలతో తీవ్రంగా నష్టపోయిన టర్కీకి భారత్ సాయం ప్రకటించింది. దీనిపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. భూకంప ప్రభావాన్ని తట్టుకోవడానికి అన్ని విధాలుగా టర్కీకి సాయం అందించాలని అధికారులకు సూచించారు ప్రధాని మోదీ. టర్కీకి తక్షణ సహాయ చర్యలపై అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ మిశ్రా.
కేబినెట్ సెక్రటరీ, హోం శాఖ, NDMA, NDRF, రక్షణ, విదేశాంగ శాఖ, పౌర విమానయాన, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్డీఆర్ఎఫ్, భారత వైద్య బృందాలు అత్యవసర సహాయక చర్యల కోసం రిపబ్లిక్ ఆఫ్ టర్కీ వెళ్లనున్నారు. అలాగే సహాయక సామాగ్రి, మందులు పంపనున్నారు. ఇక ప్రత్యేక శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్లు, 100 మంది NDRF సిబ్బంది సైతం టర్కీ సహాయక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. భారత వైద్య బృందాలు అవసరమైన మందులతో టర్కీ వెళ్లనున్నాయి.