Indonesia: ఇండోనేషియాలో భారీ భూకంపం.. డిసెంబర్ అంటే వణికిపోతున్న ప్రజలు
ఇండోనేషియాలోని టోబెలోకు ఉత్తరాన 259 కి.మీ దూరంలో ఆదివారం(5 డిసెంబర్ 2021) భారీ భూకంపం సంభవించింది.
Indonesia: ఇండోనేషియాలోని టోబెలోకు ఉత్తరాన 259 కి.మీ దూరంలో ఆదివారం(5 డిసెంబర్ 2021) భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.0గా నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.ఉదయం 5:17 గంటలకు భూకంపం వచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు.
ఈ సమయంలో భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. అయితే భూకంప ప్రమాదానికి సంబంధించిన పూర్తి స్థాయి వివరాలు తెలియాల్సి ఉంది. భూకంపం ధాటికి ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. అయితే, ఎటువంటి సునామీ హెచ్చరిక జారీ చేయలేదు.
సులవేసి ద్వీపంలోని పలులో 2018లో సంభవించిన భూకంప ధాటికి, ఆ తర్వాత వచ్చిన సునామీ కారణంగా 4,300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కొందరు గల్లంతు అయ్యారు. నాడు రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.5గా నమోదైంది.
2004, డిసెంబర్ 26న సుమత్రా తీరంలో 9.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో సునామీ రావడంతో 2,20,000 మంది చనిపోయారు. ఇందులో ఇండోనేషియా ప్రజలు 1,70,000 ఉన్నారు. ఇదే డిసెంబర్లో అక్కడ భూకంపం అంటే మాత్రం ప్రజలు వణికిపోతున్నారు.