Char Dham Yatra: 25 రోజుల్లో 99 మంది చార్ధామ్ యాత్రికులు మృతి.. ఎందుకిలా జరుగుతుందంటే..
చార్ధామ్ యాత్రలో విషాదం చోటు చేసుకుంటుంది. యాత్రికులు అక్కడి వాతావరణాన్ని తట్టుకోలేక మృత్యువాత పడుతున్నారు. యాత్రలో భాగంగా 25రోజుల్లో 99 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. శనివారం యాత్రలో మరో ఎనిమిది మంది మరణించడంతో సంఖ్య పెరిగింది. మృతుల్లో ఎక్కువ మంది వృద్ధులు ఉన్నారు.
Char Dham Yatra: చార్ధామ్ యాత్రలో విషాదం చోటు చేసుకుంటుంది. యాత్రికులు అక్కడి వాతావరణాన్ని తట్టుకోలేక మృత్యువాత పడుతున్నారు. యాత్రలో భాగంగా 25రోజుల్లో 99 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. శనివారం యాత్రలో మరో ఎనిమిది మంది మరణించడంతో సంఖ్య పెరిగింది. మృతుల్లో ఎక్కువ మంది వృద్ధులు ఉన్నారు. యాత్ర మార్గాల్లో పారా మెడికల్ సిబ్బందితో పాటు మా వైద్య సిబ్బంది వివిధ ప్రదేశాల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ జనరల్ హెల్త్ శైలజా భట్ తెలిపారు.
చార్ధామ్ యాత్రలో అధికశాతం మంది గుండె సంబంధిత సమస్యలతో చనిపోతున్నారని అధికారులు పేర్కొంటున్నారు. ఉత్తరాఖండ్లోని ఎత్తైన పుణ్యక్షేత్రాలకు వెళ్లే యాత్రికులు మరణించడం ప్రతి సంవత్సరం జరిగేదే. అయినప్పటికీ మే 3న యమునోత్రి, గంగోత్రి ఆలయాలను తెరవడంతో యాత్ర ప్రారంభమైన తర్వాత ఈ సీజన్లో యాత్ర అసాధారణంగా మారింది. ఇదే విషయంపై కేదార్నాథ్లో ఉచిత వైద్య సదుపాయాలను అందించే సిక్స్ సిగ్మా హెల్త్కేర్కు నేతృత్వం వహిస్తున్న ప్రదీప్ భరద్వాజ్ మాట్లాడుతూ.. గతంతో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటి వరకు అధిక సంఖ్యలో మరణాలు సంభవించాయని, వీటిలో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో పాటు యాత్రికులు బలహీనంగా ఉండం, రోగనిరోధక శక్తి తగ్గిపోవటం వంటి కారణాల వల్ల మరణాల సంఖ్య పెరుగుతుందని తెలిపారు.
చాలా మంది యాత్రికులు అంత ఎత్తైన ప్రదేశాలకు చేరుకోవటం అలవాటులేకపోవటంతో పాటు యాత్ర సమయంలో ఎదురయ్యే వాతావరణ మార్పులు తట్టుకొనే సామర్థ్యం లేకపోవటం, అందుకు తగిన కసరత్తు లేకపోవటంతో ఆరోగ్యం క్షీణించి మృత్యువాత పడుతున్నట్లు అక్కడి వైద్యులు పేర్కొంటున్నారు. దీనికితోడు విపరీతమైన చలి వాతావరణాన్ని తట్టుకొనేందుకు రక్షణ కవచాలు లేకపోవటం వల్ల కూడా యాత్రికుల ఆరోగ్యం క్షీణిస్తుందని అక్కడి వైద్యులు పేర్కొంటున్నారు.
ఇదిలాఉంటే చార్ ధామ్ యాత్రకు సంబంధించిన నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలను కొందరు యాత్రికుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు గర్వాల్ కమిషనర్ సుశీల్ కుమార్, డీఐజీ గర్వాల్ కెఎస్ నాగ్నాకాల్ తెలిపారు. భద్రకాళి చెక్పోస్టు వద్ద బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురు యాత్రికుల నుంచి నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలు వారు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ రిజిస్ట్రేషన్ పత్రాలతో వచ్చినవారిని తిరిగి వెనక్కు పంపిస్తున్నారు. దీనికితోడు కేదార్నాథ్ యాత్రలో యాత్రికులు ఉపయోగించే మూగ జీవాలు సైతం మృత్యువాత పడుతున్నాయి. 20 రోజుల్లో 60 మూగజీవాలు చనిపోయినట్లు అక్కడి అధికారులు తెలిపారు.
ఇదిలాఉంటే గత సంవత్సరాల్లో యాత్రికుల మరణాల డేటాను పరిశీలిస్తే.. 2019లో 90 మందికి పైగా చార్ ధామ్ భక్తులు మరణించారు, 2018లో 102 మంది, 2017లో 112 మంది మొత్తం సీజన్లో ప్రతి సంవత్సరం ఏప్రిల్-మే నుండి అక్టోబర్-నవంబర్ వరకు దాదాపు ఆరు నెలల పాటు వీటి సంఖ్య ఉంది.