Corona Patients: సీరియస్ కరోనా పేషెంట్లకే బెడ్స్
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రోగుల ఆరోగ్య స్థితి సీరియస్ అయితేనే హాస్పిటల్స్ లో బెడ్స్ కేటాయించాలని నిర్ణయించి..
Corona Patients: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రోగుల ఆరోగ్య స్థితి సీరియస్ అయితేనే హాస్పిటల్స్ లో బెడ్స్ కేటాయించాలని నిర్ణయించింది. సాధారణ లక్షణాలతో మాత్రమే కరోనా వ్యాపిస్తే వారికి బెడ్స్ కేటాయించాల్సిన అవసరం లేదని తేల్చేసింది. అలాంటి వారి కోసం కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేశామని, అక్కడకు వెళ్లాలని సూచించింది.
తెలిసో తెలియకో.. ఒకవేళ అటువంటి పేషెంట్లు హాస్పిటల్స్కు వచ్చినా.. వారిని కోవిడ్ కేర్ సెంటర్లకు పంపించాల్సిన బాధ్యత హాస్పిటల్ వర్గాలదేనని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్ పాజిటివ్ రోగులను మూడు వర్గాలుగా విభజించింది.
ఒకటి కరోనా పాజిటివ్ వచ్చిన సాధారణ రోగులు. రెండు కరోనా వచ్చాక ఆక్సిజన్ అవసరమైన వారు. మూడు వెంటిలేటర్ లేదా ఐసీయూ అవసరమైన వారుగా కేటాయించారు. మొదటి వర్గం వారికి కరోనా పాజిటివ్ తేలడంతో ఐసోలేషన్ కేంద్రాలకు పంపాలి లేదా ఇళ్లల్లోనే ఉంచి ట్రీట్మెంట్ అందించాలి. ఆక్సిజన్, వెంటిలేటర్ అవసరమైన వారికే ఆసుపత్రుల్లో బెడ్స్ కేటాయించాలి. రాష్ట్రంలో తాజాగా ప్రభుత్వం అన్ని జిల్లాల్లో 44 కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసింది.
4వేల 13 ఐసోలేషన్ పడకలను రెడీగా ఉంచింది. సాధారణ కరోనా రోగులు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అక్కడేమైనా ఇబ్బందులు తలెత్తితే తక్షణమే అంబులెన్సుల్లో ఆసుపత్రులకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా కాకుండా ఇతర జబ్బులకు ట్రీట్మెంట్ కోసం వచ్చే వారిలో తప్పనిసరి కేసులకే ప్రియారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. వాయిదా వేసే చికిత్సలు, వైద్యానికి సంబంధించి రోగులను ఇప్పుడే తీసుకోకూడదని నిర్ణయించారు.
సాధారణ పడకలకూ ఆక్సిజన్
రోజురోజుకూ కరోనా విజృంభణ పెరుగుతోంది. మూడు నెలల్లోనే గతేడాదితో పోలిస్తే మూడింతల కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని అంచనా. ఇప్పటికే అనేక హాస్పిటల్స్లో కరోనా పడకల కొరత ఏర్పడింది. మున్ముందు ఇంకా ఏర్పడే పరిస్థితి నెలకొంది. దీనిని ఎదుర్కోవాలంటే వ్యూహాత్మకంగా వ్యవహరించాలనేది వైద్య ఆరోగ్యశాఖ ఆలోచన. ఇప్పటివరకు ఆసుపత్రుల్లో కరోనా కోసం సాధారణ, ఆక్సిజన్, ఐసీయూ లేదా వెంటిలేటర్ పడకలుగా వర్గీకరించి ఆ ప్రకారం నింపుతున్నారు.
మొత్తం 61 గవర్నమెంట్ హాస్పిటల్స్లో కరోనా కోసం 8వేల 542 పడకలు కేటాయించగా, అందులో వెయ్యి 551 సాధారణ పడకలున్నాయి. మిగిలినవి ఆక్సిజన్, ఐసీయూ పడకలు. ఇక 244 ప్రైవేట్ కార్పొరేట్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో 11వేల 778 పడకలు కరోనాకు కేటాయించగా, అందులో 4వేల 657 సాధారణ పడకలు ఉన్నాయి. వీటిల్లో 3వేల 924 ఆక్సిజన్, 3వేల 197 ఐసీయూ లేదా వెంటిలేటర్ బెడ్స్ ఉన్నాయి. ఇలా సాధారణ పడకలు అధికంగా ఉండటంతో సీరియస్ గా ఉన్న పేషెంట్లకు బెడ్స్ కొరత ఏర్పడుతుందని సర్కారు అంటోంది. ఈ మేరకే ప్రభుత్వ ఆసుపత్రుల్లోని సాధారణ పడకలకూ ఆక్సిజన్ సదుపాయం కల్పించాలని నిర్ణయించారు.