Sandeepa Dhar : ట్రక్కుల్లో దాక్కొని కశ్మీర్ నుంచి వచ్చేశాం.. కశ్మీర్ ఫైల్స్ చూసి బాలీవుడ్ హీరోయిన్ వ్యాఖ్యలు..
సందీప ధర్ తన ఇన్స్టాగ్రామ్ లో.. ''కశ్మీర్ పండిట్లు కశ్మీర్ను వదిలి వెళ్లిపోవాలని ప్రకటించిన రోజది. అప్పుడే నా కుటుంబం సొంత గడ్డను వదిలేయాలని నిర్ణయం తీసుకొని వెళ్లిపోయాం......
The Kashmir Files : ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా ఇప్పుడు దేశమంతటా సంచలనం సృష్టిస్తుంది. 1990లో కశ్మీర్ పండిట్లపై, హిందువులపై జరిగిన మారణకాండను కళ్ళకు కట్టినట్టు తెరకెక్కించారు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కంటతడి పెడుతున్నారు. నరేంద్రమోడీతో సహా సెలబ్రిటీలంతా ఈ సినిమాపై ప్రశంశలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమా చూసిన బాలీవుడ్ నటి సందీప ధర్ ముప్పై ఏళ్ల క్రితం తన కుటుంబం కూడా కశ్మీర్ నుంచి వలస వచ్చిందని చెప్తూ ఎమోషనల్ అయింది. దబాంగ్, హీరో పంతి లాంటి సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులని మెప్పించిన ఈ నటి తాజాగా కశ్మీర్ ఫైల్స్ సినిమా చూసి ఎమోషనల్ గా తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.
సందీప ధర్ తన ఇన్స్టాగ్రామ్ లో.. ”కశ్మీర్ పండిట్లు కశ్మీర్ను వదిలి వెళ్లిపోవాలని ప్రకటించిన రోజది. అప్పుడే నా కుటుంబం సొంత గడ్డను వదిలేయాలని నిర్ణయం తీసుకొని వెళ్లిపోయాం. మేము కశ్మీర్ను వదిలి వెళ్లేందుకు ట్రక్కు వెనకభాగంలో దాక్కున్నాం. నా కజిన్ మా నాన్న కాళ్ల దగ్గర ఉన్న ఒక సీటుకింద దాక్కుంది. సరిగ్గా ఇదే సన్నివేశం కశ్మీర్ ఫైల్స్లో చూసి నేను షాకయ్యాను. నా కథే నేను మళ్లీ చూసుకున్నట్లనిపించింది. మా అమ్మానాన్నలు సినిమా చూసిన తర్వాత అత్యంత బాధాకరమైన జ్ఞాపకాల నుంచి ఇప్పటికీ బయటకు రాలేకపోతున్నారు. మా నానమ్మ చనిపోయింది. కానీ ఆమె పుట్టిపెరిగిన గడ్డ మాత్రం కశ్మీరే.’
‘ఈ ముఖ్యమైన విషయాన్ని చెప్పడానికి నాకు చాలా కాలమే పట్టింది. ఇప్పటికి కూడా మాకు న్యాయం జరగలేదు. ఈ ప్రపంచానికి నిజాన్ని పరిచయం చేసినందుకు వివేక్ అగ్నిహోత్రికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అనుపమ్ ఖేర్తో సహా ఈ సినిమాలో నటించిన నటీనటులందరికీ నా హ్యాట్సాఫ్’ అని పోస్ట్ చేసింది.
సందీప శ్రీనగర్లోని ఓ కశ్మీర్ పండిట్ కుటుంబంలో జన్మించింది. అక్కడ చెలరేగిన హింసాకాండతో ఆమె కుటుంబం అంతా కశ్మీర్ నుంచి వలస వెళ్లిపోయింది. తన నిజ జీవితంలో జరిగిన సంఘటనని ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాగా చూసి ఎమోషనల్ అయింది ఈ హీరోయిన్. ఇలా ఎంతో మంది ఈ సినిమాని చూసి ఎమోషనల్ అవుతున్నారు.