CM KCR – PK TEAM : ప్రశాంత్ కిషోర్ సర్వేలపై గులాబీ బాస్ అసంతృప్తి .. పీకే టీమ్‌కు కేసీఆర్ కటీఫ్ చెప్పారా?

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు సీఎం కేసీఆర్ కటీఫ్ చెప్పారా? పీకే టీమ్ సర్వేలపై గులాబీ బాస్ అసంతృప్తి వ్యక్తం చేయటంతో ఇక తెలంగాణ నుంచి పీకే టీమ్ మకాం ఎత్తేసినట్లుగా సమాచారం.

CM KCR – PK TEAM : ప్రశాంత్ కిషోర్ సర్వేలపై గులాబీ బాస్ అసంతృప్తి .. పీకే టీమ్‌కు కేసీఆర్ కటీఫ్ చెప్పారా?

CM KCR - PK TEAM

 

CM KCR – PK TEAM : ఎన్నికల వ్యూహకర్త అంటే ఠక్కున గుర్తుకొచ్చే పేరు ప్రశాంత్ కిషోర్. అందరికి బాగా పరిచయం అయిన పేరు పీకే. పీకే టీమ్ కోసం పార్టీలు పోటీ పడుతుంటాయి.ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఈయన పేరు బాగా వినిపిస్తుంది. సర్వేలు చేసి ఫలితాలను అంచనావేటయంతో పీకే టీమ్ దిట్ట. అందుకే గులాబీ బాస్ కూడా పీకే టీమ్ తో జతకట్టారు. ప్యాకేజీలు కూడా కుదుర్చుకున్నారు. దీంతో తెలంగాణలో రంగంలోకి దిగిన పీకే టీమ్ సర్వేలు నిర్వహించింది.నివేదికను గులాబీ బాస్ కేసీఆర్ కు అందజేసింది. కానీ పీకే టీమ్ నిర్వహించిన సర్వేపై గులాబీ నేతలతో పాటు కేసీఆర్ అసంతప్తి వ్యక్తంచేశారు. కేసీఆర్ తో గంటలతరబడి సమావేశాలు నిర్వహించి చర్చలు జరిపే పీకే ఇటీవల ఎక్కడా తెలంగాణలో కనిపించటంలేదు. దీంతో పీకేతో కేసీఆర్ కటీఫ్ చెప్పారనే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా మునుగోడులో గెలిచి తీరాలనే కసితో ఉన్న గులాబీ బాస్ మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఎక్కడా పీకే టీమ్ సందడి కనపించటంలేదు. దీంతో కేసీఆర్ పీకేకు గుడ్ బై చెప్పారనే వార్తలు వస్తున్నాయి.

గత ఏడాది జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీకి పని చేసింది పీకే టీమ్. బీజేపీ ఎత్తుగడలకు చెక్ పెడుతూ మమతా బెనర్జీ మరోసారి గెలవడానికి ప్రశాంత్ కిషోర్ వ్యూహాలే పని చేశాయని చెబుతారు. కొంత కాలంగా తెలంగాణలో టీఆర్ఎస్ కోసం పని చేస్తున్నారు ప్రశాంత్ కిషోర్. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా పీకే టీమ్ పలు సర్వేలు నిర్వహించింది. సీఎం కేసీఆర్ కు ఎప్పటికప్పుడు నివేదికలు ఇస్తోంది. ప్రశాంత్ కిషోర్ కూడా కేసీఆర్ తో సుదీర్ఘ మంతనాలు సాగించారు. అయితే తాజాగా పీకే టీమ్ తెలంగాణ నుంచి వెళ్లిపోయిందని తెలుస్తోంది.

తెలంగాణలో 40 పీకే టీమ్ లు పని చేస్తున్నాయని సమాచారం. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ టీమ్ లు తిరిగి నివేదికలు రూపొందించాయని తెలుస్తోంది. అయితే ప్రశాంత్ కిషోర్ టీమ్ లు ఇస్తున్న నివేదికలపై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారట. ఇంటలిజెన్స్ నుంచి వస్తున్న రిపోర్టులకు పీకే టీమ్ ఇస్తున్న నివేదికలకు అసలే పొంతనే ఉండటం లేదట. ఈ విషయంలో అసంతృప్తిగా ఉన్న కేసీఆర్… పీకే టీమ్ సేవలను తగ్గించారని అంటున్నారని సమాచారం. పీకే టీమ్ సర్వేలు ఇతర పార్టీలకు లీక్ అవుతున్నాయనే అనుమానాలు కేసీఆర్ కు ఉన్నాయంటున్నారు. కొన్ని రోజుల క్రితం పీకే టీమ్ సర్వే ఇదేనంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓ సర్వేను విడుదల చేశారు. తర్వాత కూడా పీకే టీమ్ పేరుతో సర్వేలు సోషల్ మీడియాలో వచ్చాయి. దీంతో పీకే టీమ్ వివరాలు బయటికి లీక్ అవుతున్నాయనే భావనలో గులాబీ బాస్ ఉన్నారంటున్నారు.

పార్టీ నేతల నుంచి పీకే టీమ్ సర్వేలపై ఫిర్యాదులు కేసీఆర్ కు వచ్చాయంటున్నారు. పీకే టీమ్ ప్రతినిధులు కొందరు నియోజకవర్గంలోని నేతలతో కుమ్మక్కై కావాలనే తప్పుడు నివేదికలు ఇచ్చారని కొందరు ఎమ్మెల్యేలు ఆరోపించారని చెబుతున్నారు. పార్టీ నేతల నుంచి వస్తున్న ఫిర్యాదులు, తనకు పీకే టీమ్ నుంచి వస్తున్న నివేదికలపై గుర్రుగా ఉన్న కేసీఆర్.. పీకే టీమ్ అవసరం లేదనే నిర్ణయానికి వచ్చారంటున్నారు కొంతమంది నేతలు. కేసీఆర్ తీరుతో పీకే టీమ్ లు తెలంగాణలో పని చేయడం మానేశాయని తెలుస్తోంది. గత నెల రోజులుగా మునుగోడులో తిరిగిన పీకే టీమ్ లు కూడా వెనక్కి వచ్చేశాయని అంటున్నారు.తెలంగాణలో పని చేస్తున్న టీమ్ లను ఏపీకి పంపించారని తెలుస్తోంది. 2024 ఎన్నికల కోసం ఏపీలో వైసీపీ కోసం పని చేస్తోంది పీకే టీమ్. ప్రస్తుతం హైదరాబాద్ లో కొనసాగుతున్న ఐప్యాక్ కార్యాలయాన్ని కూడా ఏపీకి తరలించనున్నారని తెలుస్తోంది.

మరోవైపు పీకే టీమ్ పని చేయడం మానేసిందని తెలిసి గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు సంబరాలు చేసుకుంటున్నట్లుగా సమాచారం. వచ్చే ఎన్నికల్లో మెజార్టీ సిట్టింగులను మార్చాలని కేసీఆర్ కు పీకే టీమ్ నివేదిక ఇచ్చిందని గతంలో వార్తలు వచ్చాయి. పీకే టీమ్ సర్వే ఆధారంగానే టికెట్లు కేటాయిస్తారనే ప్రచారంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పరేషాన్ అయ్యారు. తమ గురించి పీకే టీమ్ ఎలాంటి నివేదిక ఇస్తుందోనని ఆందోళన చెందారు. ఇప్పుడు పీకే టీమ్ తెలంగాణలో సర్వే చేయడం మానిసేందని తెలియడంతో టీఆర్ఎస్ నేతలు లోలోపల ఖుషీ అవుతున్నారని తెలుస్తోంది.