Covid Returns : ఆగ్నేయాసియాలో కరోనా ఉప్పెన.. నిర్లక్ష్యం వద్దు.. నాల్గో వేవ్ ముప్పుపై రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్..!
Covid Returns : కరోనా మహమ్మారి అంతం కాలేదు. కరోనా ఇంకా మనతోనే ఉంది. కాస్తా వైరస్ తీవ్రత తగ్గింది మాత్రమే.. ఏ క్షణమైనా దేశంలో కరోనా విజృంభించే ఛాన్స్ లేకపోలేదు.
Covid Returns : కరోనా మహమ్మారి అంతం కాలేదు. కరోనా ఇంకా మనతోనే ఉంది. కాస్తా వైరస్ తీవ్రత తగ్గింది మాత్రమే.. ఏ క్షణమైనా దేశంలో కరోనా విజృంభించే ఛాన్స్ లేకపోలేదు. ఎందుకంటే.. కరోనా తీవ్రత తగ్గినట్టే తగ్గి మళ్లీ ఉప్పెనలా విజృంభించవచ్చు.. అయితే ఈ విషయంలో చాలామందిలో కరోనా ఖతమైనట్టేలే అపోహ పడుతున్నారు. వాస్తవానికి కరోనా నాల్గో వేవ్ ముప్పు పొంచి ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఇతర ఆగ్నేయాసియా దేశాల్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసుల తీవ్రత పెరిగిపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇజ్రాయెల్లో కొత్త వేరియంట్ బయటపడటం, చైనాలో కరోనా తీవ్రత పెరగడం.. లాక్ డౌన్ విధించాల్సిన పరిస్థితి ఎదురైంది. అమెరికాతో పాటు దక్షిణాసియాలో కూడా చాలా దేశాల్లో కరోనా విలయతాండవం చేస్తోంది.
యూరప్ దేశాల్లోనూ కరోనా విజృంభిస్తోంది. కరోనా పరిస్థితులు మళ్లీ దారుణంగా మారిపోతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తోంది. కరోనా కేసులు తగ్గాయని సామాజిక దూరం, మాస్క్ లు ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగేస్తున్నారంటూ కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇతర దేశాల్లో కరోనా విజృంభణపై ప్రస్తావిస్తూ దేశంలో పలు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ కేంద్రపాలిత, రాష్ట్రాలకు లేఖ రాశారు. కరోనా విషయంలో అసలే నిర్లక్ష్యం వద్దని అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఐదు దశల స్ట్రాటజీ.. టెస్ట్, ట్రాక్, ట్రీట్, అవసరమైన చర్యలు, వ్యాక్సినేషన్ వంటివి తప్పనిసరిగా పాటించాలని లేఖలో రాష్ట్రాలకు పలు సూచనలు చేశారు.
ICMR, NCDC (National Centre for Disease Control ప్రొటోకాల్స్ ప్రకారమే కరోనా టెస్టులు నిర్వహించాలని ఆయన సూచనలు చేశారు. కరోనా కేసుల వివరాలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని, కరోనా ఇన్ఫెక్షన్ల తీవ్రత పెరగకుండా ఉండేలా నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు. కంటోన్మైట్, క్లస్టర్, డేంజర్ జోన్ల ఏర్పాటుపై కూడా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్లు ధరించడం, భౌతిక దూరంతో పాటు శానిటైజేషన్ వంటి సూచనలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయరాదని ఆయన తెలిపారు. ఫిబ్రవరి 25న విడుదల అయిన గైడ్లెన్స్పై కేంద్రం ప్రస్తావించింది.
ఈ మార్గదర్శకాలను పాటిస్తూ కరోనా పరిస్థితులకు తగినట్టుగా ఆర్థిక వ్యవహారాల కొనసాగింపునకు అనుమతులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేసింది. మార్చి 16న కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మాన్షుక్ మాండవియా అధ్యక్షతన హైలెవల్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుదలపై చర్చించారు. దేశంలో కరోనా నాల్గో వేవ్ ముప్పు పొంచి ఉందనే ఆందోళన నెలకొన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కరోనా నియంత్రణ చర్యలు చేపట్టేలా రాష్ట్రాలను అప్రమత్తం చేయాల్సిందిగా కేంద్ర మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి లేఖను కేంద్ర ఆరోగ్య కార్యదర్శి విడుదల చేశారు.
దేశంలో కరోనా కేసుల తీవ్రత తగ్గుముఖం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2, 528 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనా మరణాలు 149గా నమోదయ్యాయి. కరోనా యాక్టివ్ కేసులు 29, 181గా చేరాయి. దాదాపు 685 రోజుల తర్వాత 30 వేలకు దిగువన కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటివరకూ కరోనా కేసులు 4,30,04,005 నమోదయ్యాయి. కరోనా మొత్తం మరణాల సంఖ్య 5,16,281కు చేరింది.
Read Also : Covid-19 : ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ పెరుగుతున్న కోవిడ్ కేసులు