Sudan Crisis: సూడాన్లో చిక్కుకున్న తెలంగాణ వారికోసం.. ఢిల్లీ తెలంగాణ భవన్లో కంట్రోల్ రూం
సూడాన్లో చిక్కుకున్న తెలంగాణ వారిని సురక్షితంగా తమతమ ప్రాంతాలకు చేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం దృష్టిసారించింది. ఆపరేషన్ కావేరిలో భాగంగా భారత్ తిరిగి వస్తున్న వారిలో తెలంగాణ ప్రజలు ఉంటే వారికి సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
Sudan Crisis: సూడాన్ దేశంలోని రెండు ప్రధాన వర్గాల మధ్య ఆధిపత్య పోరు కారణంగా హింస చెలరేగింది. ఈ హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న సూడాన్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సూడాన్లో సుమారు మూడు వేల మంది భారతీయులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వీరిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఆపరేషన్ కావేరి కార్యక్రమంను కేంద్రం చేపట్టింది. తొలివిడతగా 278 మంది భారతీయులను యుద్ధ నౌక ద్వారా సూడాన్ నుంచి సౌదీ అరేబియాలోనిజెడ్డాకు తరలించినట్లు భారత విదేశాంగశాఖ వెల్లడించింది. రెండో బ్యాచ్లో 148 మంది భారతీయులను తొలి విమానంలో స్వదేశానికి తరలించినట్లు తెలిసింది. మూడో బ్యాచ్లో 135 మంది భారతీయులతో రెండో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సీ-130జే విమానం సౌదీ అరేబియా లోని జెడ్డా కు చేరుకున్నట్లు విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి మురళీధర్ తెలిపారు.
ఇదిలాఉంటే సూడాన్లో చిక్కుకున్న తెలంగాణ వారిని సురక్షితంగా తమతమ ప్రాంతాలకు చేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం దృష్టిసారించింది. ఆపరేషన్ కావేరిలో భాగంగా భారత్ తిరిగి వస్తున్న వారిలో తెలంగాణ ప్రజలు ఉంటే వారికి సహాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం ఢిల్లీ తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. సూడాన్లో చిక్కుకున్న తెలంగాణ వారి వివరాలకోసం విదేశాంగ శాఖతో సమన్వయం చేసుకుంటున్నామని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ అన్నారు. సుడాన్ నుంచి వస్తున్న భారతీయుల అంశం పై అన్ని రాష్ట్రాల రెసిడెంట్ కమిషనర్లను ఇప్పటికే విదేశాంగశాఖ అప్రమత్తం చేసిన విషయం విధితమే.
Somesh Kumar : మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ పొలిటికల్ ఎంట్రీ .. గులాబీ గూటిలో కీలక బాధ్యతలు
ఢిల్లీ తెలంగాణ భవన్లో అధికారులతో రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ సమీక్ష జరిపారు. జెడ్డా నుంచి భారత్లోని ఢిల్లీ, ముంబైకి విమానాల్లో సుడాన్లో చిక్కుకున్నవారు భారతీయులు తిరిగివస్తున్నారని, ప్రస్తుతం ఈరోజు వస్తున్నవారిలో నలుగురు తెలంగాణ వారు ఉన్నట్లు తెలిసిందని అన్నారు. ఢిల్లీ వచ్చే వారికి ఇక్కడ వసతి భోజనం సహా ఢిల్లీ నుంచి హైదరాబాద్ పంపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఉప్పల్ తెలిపారు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన వారిని ఏవిధంగా తెలంగాణకి పంపామో అదే తరహాలో ఢిల్లీలో ఏర్పాట్లు చేస్తున్నామని గౌరవ్ ఉప్పల్ అన్నారు.