Harish Rao : దొంగే దొంగా అన్నట్లు మోదీ మాట్లాడారు, కేసీఆర్ ఓ అద్భుత దీపం-హరీశ్ రావు

Harish Rao: ఉత్తరప్రదేశ్ డబుల్ ఇంజన్ సర్కార్ లో కరెంట్ సరఫరా లేక ఆయిల్ పోసి మోటార్లు నడుపుతున్నారు. బీడీ కార్మికులకు పెన్షన్లు ఇవ్వడం లేదు.

Harish Rao : దొంగే దొంగా అన్నట్లు మోదీ మాట్లాడారు, కేసీఆర్ ఓ అద్భుత దీపం-హరీశ్ రావు

Harish Rao (Photo : Twitter)

Harish Rao : హైదరాబాద్ పర్యటనలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ చేసిన ఆరోపణలను మంత్రి హరీశ్ రావు ఖండించారు. కేంద్ర ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం లేదని ప్రధాని మోదీ అనడం అవాస్తవం అన్నారు. నిన్నటి సభలో రాష్ట్రం ప్రభుత్వం అభివృద్ధికి సహకరించడం లేదని ప్రధాని మోదీ అనడం దారుణం అన్నారు.

తెలంగాణపై బురద జల్లే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. దొంగే దొంగా అన్నట్లు మోదీ మాటలు ఉన్నాయన్నారు. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం ప్రధాని మోదీ ఆపారని హరీశ్ రావు అన్నారు. కరెంట్ మోటార్లకు మీటర్లు పెట్టాలని రూ.30వేల కోట్లు ఆపారని చెప్పారు. తెలంగాణ అభివృద్ధిని బీజేపీ అడ్డుకుంటోందన్నారు.

సిద్ధిపేట రూరల్ మండలం రాఘవపూర్ లో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. సిద్ధిపేట శివాజీ సర్కిల్ నుండి రాఘవా పూర్ వరకు విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ తో మంత్రి హరీశ్ కి స్వాగతం పలికారు. గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, పార్టీ జెండాను ఆవిష్కరించారు మంత్రి హరీశ్ రావు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్ రావు.. ఎమోషనల్ అయ్యారు.

Also Read..PM Modi : కేంద్ర ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేదు : ప్రధాని మోదీ

” మీరు చూపిస్తున్న ప్రేమకు నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. మీ ఆదరణకు నేను ఎంత సేవ చేసినా తక్కువే. ఇంకా మీకు చాలా సేవ చేయాలి. మీ బలగం చూస్తుంటే ఎన్ని జన్మలు ఎత్తినా సరిపోదు. చివరి శ్వాస వరకు సేవ చేస్తా. మీకు నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టిచ్చినా తక్కువే. ఈ గడ్డ గులాబీ అడ్డా.

రానే రాదు అన్న తెలంగాణను, కానే కాదు అన్న కాళేశ్వరంను కట్టి మండుటెండల్లో మత్తల్లు దుంకిస్తున్నాడు కేసీఆర్. వెనుకట పంట వేయాలి అంటే మోగులు వైపు చూసేది. నేడు కేసీఆర్ దయవల్ల కాలంతో సంబంధం లేకుండా పంట వేయవచ్చు. రూ.138 కోట్ల వడ్లు తెలంగాణ వచ్చినప్పుడు పండితే.. నేడు రూ.1,548 కోట్ల వడ్లు పండుతున్నాయి. కేసీఆర్ అనే అద్భుత దీపం వల్ల అద్భుతమైన పంటలు పండుతున్నాయి. రాష్ట్రం వచ్చాక ఎరువుల కోసం ఇబ్బంది లేదు. నేడు ప్రతి ఇంట్లో కేసీఆర్ ఉన్నాడు. కాళేశ్వరం దండగ అన్న ప్రతిపక్షాలు.. గ్రామాల్లోకి వస్తే పండగో, దండగో తెలుస్తుంది.

Also Read..Harish Rao Thanneeru : ప్రధాని మోదీ.. తెలంగాణపై విషాన్ని కక్కడానికే వచ్చినట్లుంది- హరీశ్ రావు

ఉత్తరప్రదేశ్ డబుల్ ఇంజన్ సర్కార్ లో కరెంట్ సరఫరా లేక ఆయిల్ పోసి మోటార్లు నడుపుతున్నారు. రూ.2కోట్లతో పుల్లుర్ లక్ష్మినరసింహ స్వామి దేవాలయం అభివృద్ధి చేసుకున్నాం. త్వరలోనే గృహలక్ష్మి కార్యక్రమం ప్రారంభం చేసుకుందాం. కాంగ్రెస్, బీజేపి ప్రభుత్వాలు అధికారంలో ఉన్న చోట బీడీ కార్మికులకు పెన్షన్లు ఇవ్వలేదు. గాంధీ, నిమ్స్ ఆసుపత్రుల్లో ఉన్న సేవలు సిద్దిపేటలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పెట్టి అందిస్తాం” అని మంత్రి హరీశ్ రావు అన్నారు.