Harish Rao Thanneeru : ప్రధాని మోదీ.. తెలంగాణపై విషాన్ని కక్కడానికే వచ్చినట్లుంది- హరీశ్ రావు

Harish Rao Thanneeru : రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సహకారం అందించడం లేదని మోడీ గారు చెప్పడం హాస్యాస్పదం. నిజానికి ఈ పరిస్థితి రివర్స్ గా ఉంది.

Harish Rao Thanneeru : ప్రధాని మోదీ.. తెలంగాణపై విషాన్ని కక్కడానికే వచ్చినట్లుంది- హరీశ్ రావు

Harish Rao Thanneeru (Photo : Twitter)

Harish Rao Thanneeru : హైదరాబాద్ పర్యటనలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ చేసిన విమర్శలు, ఆరోపణలను బీఆర్ఎస్ నాయకులు ఖండిస్తున్నారు. ప్రధాని మోదీపై ఎదురుదాడికి దిగారు. ప్రధాని మోదీ.. ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడానికి హైదరాబాద్ కి వచ్చినట్లు లేదు.. తెలంగాణపై తన కడుపులోని విషాన్ని కక్కడానికే వచ్చినట్లు ఉందని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రధాని మోదీ మాట్లాడిన ప్రతీ మాట సత్య దూరం. ప్రధానిగా ఇన్ని అబద్ధాలు ఆడడం ఆయనకే చెల్లింది అంటూ.. వరుస ట్వీట్లతో ప్రధాని వైఖరిని దుయ్యబట్టారు హరీశ్ రావు.

”తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఆసరా పెన్షన్, రైతు బంధు వంటివి నేరుగా లబ్దిదారుల ఖాతాలో జమ అవుతున్నాయి. తన వల్లే డిబిటి మొదలైనట్టు అనడం పచ్చి అబద్దం. ఇందులో గొప్ప చెప్పుకోవాల్సింది ఏముంది? రైతు బంధును కాపీ కొడితే పీఎం కిసాన్ అయ్యింది. పీఎం కిసాన్ వల్లే మొదటి సారి రైతులకి లబ్ది అని చెప్పుకోవడం సిగ్గు చేటు.(Harish Rao Thanneeru)

Also Read..PM Modi : కేంద్ర ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేదు : ప్రధాని మోదీ

రైతు బంధుతో పోల్చితే పీఏం కిసాన్ సాయమెంత? వ్యవసాయానికి, పరిశ్రమలకు చేయూత అని చెప్పడం పూర్తి అవాస్తవం. ITIR ను బెంగళూర్ కు తరలించారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన వెంటనే గుజరాత్ లో అర్బిట్రేషన్ సెంటర్ పెట్టారు. తెలంగాణ ధాన్యాన్ని కొనకుండా రైతుల కంట కన్నీరు పెట్టించారు. ఇవన్నీ చేసింది మీ ప్రభుత్వం కాదా మోడీ గారు? అదానీ వాదం గురించి ప్రజల దృష్టి మళ్లించడానికి.. లేని పరివార వాదం గురించి మాట్లాడడం మీకే చెల్లింది.

రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సహకారం అందించడం లేదని మోడీ గారు చెప్పడం హాస్యాస్పదం. నిజానికి ఈ పరిస్థితి రివర్స్ గా ఉంది. రాష్ట్రానికి రావాల్సిన గిరిజన యూనివర్సిటీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, జాతీయ హోదా వంటివి ఇవ్వకుండా కేంద్రం తెలంగాణకు ఎలాంటి సహకారం అందించడం లేదు” అని ట్వీట్ చేశారు మంత్రి హరీశ్ రావు.

Also Read..Telangana : తెలంగాణలో అభివృద్ధి జరగకపోతే కేంద్రం అవార్డులు ఎందుకిస్తుంది? అధికారిక కార్యక్రమంలో రాజకీయాలేంటి? : మంత్రి తలసాని

ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచింది. సికింద్రాబాద్ సభలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ చేసిన విమర్శలు, ఆరోపణలు దుమారం రేపాయి. అవినీతి ప్రభుత్వం, కుటుంబ పార్టీ అంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ రగడకు దారితీశాయి. కేంద్ర ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం అందడం లేదని.. దీంతో తెలంగాణ అభివృద్ధికి ఆటంకం కలుగుతోందని ప్రధాని మోదీ అన్నారు. ప్రధాని మోదీ ప్రసంగంపై బీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు. మోదీ అవాస్తవాలు చెప్పారని మండిపడుతున్నారు. అసలు నిజం ఏంటంటే.. ఈ తొమ్మిదేళ్లలో.. ప్రధాని మోదీ తెలంగాణకు ఎలాంటి సాయమూ చేయలేదని అంటున్నారు.