congress: ఏ నేరంపై విచారణ జరుపుతున్నారని అడిగితే సమాధానం లేదు: చిదంబరం
చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోన్న తీరుకి వ్యతిరేకంగా తాము నిరసన తెలుపుతున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అన్నారు.
congress: చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోన్న తీరుకి వ్యతిరేకంగా తాము నిరసన తెలుపుతున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు పంపిన విషయం తెలిసిందే. రాహుల్ గాంధీ వరుసగా రెండో రోజు విచారణ ఎదుర్కొంటున్న వేళ దీనిపై చిదంబరం మీడియాతో మాట్లాడారు.
National Herald case: రాహుల్ గాంధీని రెండో రౌండ్లో విచారిస్తోన్న ఈడీ.. మండిపడ్డ ఖర్గే
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చట్ట ప్రకారమే పని చేసుకుంటే పోతే తమకు ఎలాంటి అభ్యంతరాలూ ఉండవని చిదంబరం అన్నారు. కానీ, ఈడీ చట్ట ప్రకారం వ్యవహరించడం లేదని ఆరోపించారు. ఏ నేరంపై విచారణ జరుపుతున్నారని తాము అడిగితే, తమ ప్రశ్నకు ఈడీ నుంచి సమాధానం లేదని ఆయన చెప్పారు. ఎఫ్ఐఆర్ను ఏ పోలీస్ ఏజెన్సీ నమోదు చేసిందని, దానికి సంబంధించిన కాపీ ఏదని అడిగితే కూడా సమాధానం లేదని విమర్శించారు.
ఈడీ చట్ట ప్రకారం వ్యవహరించడం లేదని స్పష్టమవుతోందని చిదంబరం అన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు ఉంటుందని చెప్పారు. గత నాలుగైదు ఏళ్లలో ఈడీ కనీసం ఒక్క బీజేపీ నేతపై అయినా కేసు నమోదు చేసిందా అని ఆయన నిలదీశారు. అలాగే, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ఈడీ కనీసం ఒక్క కేసు అయినా పెట్టిందా అని ఆయన ప్రశ్నించారు.