IPL2022 MI Vs DC : ఇషాన్ మెరుపు ఇన్నింగ్స్.. ఢిల్లీ టార్గెట్ 178
ఢిల్లీ కేపిటల్స్ తో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ దంచికొట్టింది. ఇషాన్ కిషన్ రెచ్చిపోయాడు. ఢిల్లీ ముందు భారీ టార్గెట్ ఉంచింది ముంబై. (IPL2022 MI Vs DC)
IPL2022 MI Vs DC : ఐపీఎల్-2022 సీజన్-15లో భాగంగా ఢిల్లీ కేపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ దంచికొట్టింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబై జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఢిల్లీ ముందు 178 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ముంబై ఓపెనర్ ఇషాన్ కిషన్ (81*) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పరుగుల వరద పారించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ(41), తిలక్ వర్మ (22) కూడా రాణించారు. ఢిల్లీ బౌలరల్లో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు తీశాడు.
ఓపెనర్ ఇషాన్ కిషన్ రెచ్చిపోయాడు. 48 బంతుల్లోనే 81 పరుగులు చేశాడు. 11 ఫోర్లు బాదాడు. 2 సిక్సులు కూడా కొట్టాడు. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ (32 బంతుల్లో 41, 4×4, 2×6) సైతం విలువైన పరుగులు చేశాడు. వీరిద్దరూ తొలి వికెట్కు 67 పరుగులు జోడించి శుభారంభం చేశారు. అయితే, రోహిత్ ఔటయ్యాక మిగతా బ్యాట్స్మెన్ విఫలమయ్యారు. మరో ఎండ్ లో ఇషాన్ ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. తిలక్ వర్మ (22) అన్మోల్ప్రీత్ సింగ్ (8), పొలార్డ్ (3), టిమ్ డేవిడ్ (12) విఫలమయ్యారు. చివర్లో డేనియల్ సామ్స్( 2 బంతుల్లో 7 పరుగులు.. 1×6) సిక్సర్ కొట్టాడు. ఇక ఢిల్లీ బౌలర్లలో మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. నాలుగు ఓవర్లలో 18 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు తీసి 27 పరుగులిచ్చాడు.(IPL2022 MI Vs DC)
కాగా, ముంబై ఇండియన్స్ ఐదు సార్లు టైటిల్ విన్నర్ గా నిలిచింది. గత సీజన్లో ప్లేఆఫ్స్కు అర్హత సాధించలేకపోయిన ముంబై, ఈసారి ఆరంభం నుంచే దూకుడుగా ఆడాలని చూస్తోంది. మరోవైపు తొలి మ్యాచ్లో నెగ్గి మంచి ఆరంభం సాధించాలని ఢిల్లీ కేపిటల్స్ కూడా ఆశిస్తోంది.
IPL2022 KKR Beats CSK : ఐపీఎల్లో కోల్కతా బోణీ.. చెన్నైపై గెలుపు
జట్ల వివరాలు…
ముంబయి: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, అన్మోల్ ప్రీత్ సింగ్, కీరన్ పొలార్డ్, టిమ్ డేవిడ్, డేనియల్ శామ్స్, మురుగన్ అశ్విన్, టైమల్ మిల్స్, జస్ప్రీత్ బుమ్రా, బసిత్ తంపి
దిల్లీ: పృథ్వీ షా, టిమ్ సీఫెర్ట్, మన్దీప్ సింగ్, రిషభ్ పంత్, రోమన్ పోవెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, కమలేష్ నాగర్కోటి
ఐపీఎల్ 15వ సీజన్ శనివారం (మార్చి 26, 2022) నుంచి ప్రారంభమైంది. గత సీజన్లో ఛాంపియన్గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్, రన్నరప్ కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తొలి పోరులో తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో కోల్ కతా విజయం సాధించింది. ఈసారి ఐపీఎల్ పోటీలు ముంబై, పుణె నగరాల్లోనే నిర్వహించనున్నారు.(IPL2022 MI Vs DC)
ఈసారి ఐపీఎల్ లో అహ్మదాబాద్ (గుజరాత్ టైటాన్స్), లక్నో (లక్నో సూపర్ జెయింట్స్) జట్లు కూడా ఆడుతుండగా, ఫ్రాంచైజీల సంఖ్య 10కి పెరిగింది. ఈ జట్లన్నింటికీ ముంబైలోని వివిధ హోటళ్లలో బస ఏర్పాటు చేశారు. అయితే, ముంబైలో క్రికెట్ మైదానాలకు, ఆటగాళ్లు బస చేస్తున్న హోటళ్లు చాలా దూరంలో ఉన్నాయి. దాంతో, ఆటగాళ్లను మైదానానికి తరలించేందుకు ప్రత్యేకంగా గ్రీన్ కారిడార్లు ఏర్పాటు చేశారు.
ఆటగాళ్లను తరలించే వాహనాలు ట్రాఫిక్ లో చిక్కుకోకుండా ఈ గ్రీన్ కారిడార్లు హెల్ప్ అవుతాయి. ఇందుకోసం వెయ్యి మందికి పైగా పోలీసులను వినియోగిస్తున్నారు. ప్రతి జట్టుకు పోలీసు ఎస్కార్ట్ కల్పిస్తున్నట్టు ముంబై ట్రాఫిక్ పోలీసు విభాగం తెలిపింది. అదే సమయంలో, సాధారణ ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా, వారిని ఇతర మార్గాల్లోకి మళ్లించే ఏర్పాట్లు చేశారు. ఈ సీజన్ లో ఐపీఎల్ ను టాటా గ్రూప్ స్పాన్సర్ చేస్తోంది.