Uttar Pradesh : ఉత్తరప్రదేశ్ లో కిసాన్ మహా పంచాయత్
రైతులందరిదీ ఒకే దారి.. 15 రాష్ట్రాల నుంచి దండులా కదలి వస్తున్నారు. 5 లక్షల మంది ఒకే చోటుకు చేరి ప్రభుత్వానికి తమ సత్తా చూపించబోతున్నారు. దేశం నలుమూలల నుంచి రైతులు తరలి వసున్నారు.
Kisan Maha Panchayat : రైతులందరిదీ ఒకే దారి.. 15 రాష్ట్రాల నుంచి దండులా కదలి వస్తున్నారు. ఐదు లక్షల మంది ఒకే చోటకు చేరి ప్రభుత్వానికి తమ సత్తా చూపించబోతున్నారు. దేశం నలుమూలల నుంచి వేలాదిగా రైతులు తరలి వస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహిస్తున్న కిసాన్ మహా పంచాయత్కు ఐదు లక్షల మంది వస్తారని అంచనా. ముజఫర్నగర్లోని ప్రభుత్వ ఇంటర్ కళాశాల మైదానానికి రైతులు చేరుకుంటున్నారు. మిషన్ ఉత్తరప్రదేశ్-ఉత్తరాఖండ్ను రైతు సంఘాలు ప్రారంభించబోతున్నాయి.
కిసాన్ మహా పంచాయత్ ద్వారా యూపీ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వాలు రైతులు, వ్యవసాయ కూలీలు, వ్యవసాయ ఉద్యమ మద్దతుదారుల శక్తిని తెలుసుకుంటారని సంయుక్త కిసాన్ మోర్చా పేర్కొంది. వ్యవసాయ ఉద్యమానికి అన్ని కులాలు, మతాలు, రాష్ట్రాలు, చిన్న వ్యాపారులు, సమాజంలోని అన్ని వర్గాల మద్దతు ఉందనే విషయాన్ని కిసాన్ మహాపంచాయత్ నిరూపిస్తుందని అభిప్రాయపడింది.
మహా పంచాయత్లో పాల్గొనే రైతులకు భోజన ఏర్పాటు కోసం 500 ట్రాక్టర్ ట్రాలీ లాంగర్ సేవలు, 100 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయాన్ని ప్రకటిస్తారని భావిస్తున్నారు. భారత్ బంద్కు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు ఇస్తుందని చెబుతున్నారు. ఇప్పటికే ఎక్కడికక్కడ రైతులు తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ్టి వేదిక ద్వారా రైతు శక్తిని చాటాలని భావిస్తోంది.