Stock Market : బుల్ పరుగులతో సరికొత్త రికార్డులు..బుల్లెట్ ట్రైన్లా దూసుకెళ్తున్న IRCTC షేర్
వరుస లాభాల్లో దూసుకుపోతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం మరో సరికొత్త స్థాయిని అధిరోహించాయి.
Stock Market వరుస లాభాల్లో దూసుకుపోతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం మరో సరికొత్త స్థాయిని అధిరోహించాయి. అంతర్జాతీయ సానుకూలతలకు తోడు వివిధ కంపెనీల త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో సూచీలు పరుగులు పెట్టాయి. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ తొలిసారిగా 18వేల ఎగువన ముగియగా..బాంబే స్టాక్ ఎక్సేంజీ(BSE) సూచీ సెన్సెక్స్ తొలిసారి 61వేల మార్కును దాటింది.
గురువారం..మార్కెట్ ఆరంభం నుంచే లాభాలతో దూసుకెళ్లాయి దేశీయ స్టాక్ మార్కెట్లు. బీఎస్ఈ- సెన్సెక్స్ 568 పాయింట్లు లాభపడి.. 61,305 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 176 పాయింట్లు పెరిగి..18,338 వద్ద ముగిసింది.
నిఫ్టీలో అదానీ పోర్ట్స్, విప్రో, గ్రాసీమ్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రధాన లాభాలను పొందగా.. కోల్ ఇండియా, ఐషర్ మోటార్స్, టాటా మోటార్స్, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. ఆటో రంగం మినహా అన్ని ఇతర సెక్టోరల్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఇన్ ఫ్రా, ఐటీ, రియాల్టీ, పిఎస్యు బ్యాంక్, పవర్, మెటల్ సూచీలు ఒక్కొక్కటి ఒక శాతం పెరిగాయి.
గత రెండు వారాలుగా స్టాక్ మార్కెట్లో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన ఐఆర్సీటీసీ షేర్లు మరోసారి దుమ్ము రేపాయి. ఈ కంపెనీ షేర్లతో ఒక్కసారిగా వచ్చిపడుతున్న లాభాలతో ఇన్వెస్టర్లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఐఆర్సీటీసీ షేరు బుల్లెట్ రైలు వేగంతో ఐదువేలు క్రాస్ చేసి జీవనకాల గరిష్ఠం రూ. 5485ని టచ్ చేసింది. ఇవాళ ఒక్కరోజే ఈ షేరు 556 రూపాయలు పెరిగింది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఈ షేరు రూ. 4786 నుంచి రూ. 5480కి చేరుకుని సరికొత్త రికార్డు సృష్టించింది. గత వారం ఆల్టైం హై దగ్గర అనుమానంగా ఈ కంపెనీ షేర్లను కొన్నవారికి సైతం భారీ లాభాలను అందించింది ఐఆర్సీటీసీ.