Vande Bharat Trains: పట్టాలెక్కనున్న మరో ఐదు వందేభారత్ రైళ్లు.. ఏకకాలంలో ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్ వేదికగా ఐదు వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు.
PM Narendra Modi: అత్యాధునిక సదుపాయాలు కలిగిన సెమీహైస్పీడ్ వందే భారత్ రైళ్ల (Vande Bharat Trains) ప్రస్థానంలో మరో కీలక ఘట్టం ఆవిష్కారం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఐదు వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ఒకేసారి ప్రారంభించనున్నారు. ఇందుకుగాను మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాజధాని భోపాల్ (Bhopal) లోని రాణి కమలాపతి రైల్వేష్టేషన్ (Rani Kamalapati Railway Station) వేదిక కానుంది. మంగళవారం ఉదయం 10.30 గంటలకు జెండాఊపి ప్రధాని ఈ రైళ్లను ప్రారంభించనున్నారు. రాణి కమలపాటి – బజల్పూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ మినహా మిగిలిన నాలుగు రైళ్లను ప్రధాని మోదీ వర్చువల్ గా జెండా ఊపి ప్రారంభిస్తారు.
ప్రధాని నరేంద్ర మోదీ కొత్తగా ప్రారంభించే ఈ ఐదు వందే భారత్ రైళ్లలో.. భోపాల్ (రాణికమలాపతి) బజల్పుర్, ఖజురహెూ – భోపాల్ – ఇండోర్, అదేవిధంగా మడ్గావ్ – ముంబై, ధార్వాడ్ – బెంగళూరు, రాంచీ – పాట్నా మార్గాల్లో ప్రయాణించనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తాజాగా ప్రారంభించే ఐదు రైళ్లతో దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్ల సంఖ్య 23కు చేరుకుంటుంది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తన పర్యటన గురించి ప్రధాని మోదీ ట్విటర్ వేదికగా వివరాలు పంచుకున్నారు. ‘నేను రెండు కార్యక్రమాల్లో పాల్గొనడానికి మంగళవారం (జూన్27న) భోపాల్లో ఉంటాను. ముందుగా రాణి కమలాపతి రైల్వే స్టేషన్లో జరిగే ఐదు వందే భారత్ రైళ్లను జెండాఊపి ప్రారంభిస్తాను. ఈ రైళ్లు మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, బీహార్ మరియు జార్ఖండ్లలో కనెక్టివిటీని మెరుగుపరుస్తాయి.’ అని మోదీ తెలిపారు.
I will be in Bhopal tomorrow, 27th June to take part in 2 programmes. First, 5 Vande Bharat trains would be flagged off at a programme in Rani Kamalapati Railway Station. These trains will improve connectivity in Madhya Pradesh, Karnataka, Maharashtra, Goa, Bihar and Jharkhand.
— Narendra Modi (@narendramodi) June 26, 2023