Petrol Ki Baat : మన్ కీ బాత్ కాదు పెట్రోల్ కీ బాత్ చేయండి
దేశ ఆర్థికవ్యవస్థను నాశనం చేస్తున్నారంటూ మోదీ సర్కార్ పై నిప్పులు చెరిగారు బెంగాల్ సీఎం మమతాబెనర్జీ.
Petrol Ki Baat దేశ ఆర్థికవ్యవస్థను నాశనం చేస్తున్నారంటూ మోదీ సర్కార్ పై నిప్పులు చెరిగారు బెంగాల్ సీఎం మమతాబెనర్జీ. వ్యాక్సిన్ కొరతను నివారించడంలో మోదీ సర్కారు పూర్తిగా విఫలమైందని ఆమె ఆరోపించారు. కొవిడ్ వ్యాక్సిన్ల పేర రూ.35,000 కోట్లు కేటాయించి, సెకెండ్ వేవ్ మొదలైన తర్వాత కేంద్రం నత్తనడకన రాష్ట్రాలకు నిధులు విడుదల చేస్తే ఏం లాభమని మమత దుయ్యబట్టారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సామాన్య ప్రజల నడ్డివిరిచి, సొంత జేబులు నింపుకుంటున్నారని మమత ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ ధరలలను వారంలో నాలుగుసార్లు పెంచారని, 10 నుంచి 12 రెట్లు ధరలు పెరుగడంతో ప్రజల నుంచి కేంద్రానికి రూ.3.71 లక్షల కోట్లు వచ్చాయని చెప్పారు
ఇవాళ కోల్ కతాలో మీడియా సమావేశంలో మమత మాట్లాడుతూ.. మొత్తం ఆర్థిక వ్యవస్థ మందకొడిగా ఉందన్నారు. రోజురోజుకీ ఇంధన ధరలు పెరుగుతున్నాయని… అయితే కేంద్ర ప్రభుత్వం పనిలేకుండా కూర్చుందని మమత తెలిపారు. మన ప్రధాని తన మన్ కి బాత్ తో మాత్రమే బిజీగా ఉన్నారని దీదీ విమర్శించారు. ప్రధాని మోదీ ”మన్ కీ బాత్”కు బదులుగా ”పెట్రోల్ అండ్ వ్యాక్సిన్ కీ బాత్” చేయాలని సూచించారు.
కరోనా పరిస్థితుల్లో కూడా రాష్ట్రాలకు నిధులపై కేంద్ర ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తున్నదని మమత మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు అధిక నిధులు ఇస్తూ విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు తక్కువ నిధులిస్తున్నారని విమర్శించారు.
ఇక,కేంద్ర కేబినెట్ విస్తరణను ఉదహరిస్తూ..మంత్రి మండలి నుండి బాబుల్ సుప్రియోను తొలగించడం..వారు (బిజెపి ప్రభుత్వం) కూడా 2024లో వారి ముగింపు రాకముందే దానిని కోల్పోయారని తెలియజేస్తుందన్నారు. కేంద్ర కేబినెట్ విస్తరణపై తానేమీ మాట్లాడనన్న మమత… పునర్నిర్మాణం ప్రజల కష్టాలను అంతం చేస్తుందా? అని ప్రశ్నించారు