SC Railway : పండగ బాదుడు.. పెరిగిన రైలు చార్జీలు
కోవిడ్ స్పెషల్ రైళ్ళను నడుపుతున్న రైల్వే శాఖ తాజాగా పండుగ ప్రత్యేక రైళ్లు, తత్కాల్ ప్రత్యేక రైళ్ళు పేరుతో ప్రయాణికులపై వంద నుంచి రెండు వందల శాతం వరకు అదనంగా ఛార్జీల భారం
SC Railway : పండగల సీజన్ వస్తే చాలు, రైల్వే, బస్సు సర్వీసులకు చార్జీలు ఇటీవల విపరీతంగా పెంచేస్తున్నారు. గతేడాది కరోనా కారణంగా రద్దీ లేకపోవటంతో ఈ ఏడాది దసరా పండుగ రద్దీని రైల్వే శాఖ సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే కోవిడ్ స్పెషల్ రైళ్ళను నడుపుతున్న రైల్వే శాఖ తాజాగా పండుగ ప్రత్యేక రైళ్లు, తత్కాల్ ప్రత్యేక రైళ్ళు పేరుతో ప్రయాణికులపై వంద నుంచి రెండు వందల శాతం వరకు అదనంగా ఛార్జీల భారం వేస్తోంది. ఈక్రమంలో టికెట్ల ధర పెంపుతో బోగి రకం, దూరం బట్టి ఒక్కో ప్రయాణికుడిపై రూ.200 నుంచి రూ.700, ఆ పైన అదనపు భారం పడే అవకాశం ఉంది.
కరోనాతో ఆదాయాలు తగ్గి ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో వారికి వ్యయ ప్రయాసలు లేకుండా రవాణా సౌకర్యం కల్పించాల్సిన రైల్వే శాఖ…. అందుకు భిన్నంగా వ్యవహరిస్తుండటం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు బిహార్, ఉత్తర్ప్రదేశ్, పశ్చిమ్బెంగాల్, ఒడిశా నుంచి ఉపాధి కోసం హైదరాబాద్, ఇతర నగరాలకు వచ్చినవారు పండుగకు వెళ్తుండటంతో రైలు టికెట్లకు గిరాకీ పెరిగింది.
Also Read : Dasara Utsavalu 2021 : గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు
ఈ నెల 14న హైదరాబాద్-విశాఖపట్నం వెళ్లే గరీబ్ రథ్ రైలులో టికెట్లు అయిపోయాయి. టికెట్లు తీసుకుని మరో 142 మంది వెయిటింగ్ లిస్ట్ ఉన్నారు. అదే రోజు హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్లడానికి 16 రైళ్లు ఉండగా.. రెండు, మూడింట్లో మాత్రమే కొన్ని టికెట్లు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి మంచిర్యాల, ఖమ్మం, విజయవాడ తదితర ప్రాంతాలకు వెళ్లేవారు రెట్టింపు ఛార్జీలు భరించాల్సి వస్తోంది.