Sharad Pawar: 600 కార్ల భారీ కాన్వాయ్తో సీఎం కేసీఆర్ మహారాష్ట్రకు వెళ్లడంపై శరద్ పవార్ కామెంట్స్.. ఆందోళనకరం అంటూ..
పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి తమ ప్రాంతానికి వచ్చి పూజలు చేసుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని శరద్ పవార్ అన్నారు.. కానీ..
Sharad Pawar – KCR: మహారాష్ట్ర(Maharashtra)లో బీఆర్ఎస్ (BRS) పార్టీని విస్తరించాలని ప్రయత్నాలు చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా పందర్పూర్( Pandharpur)లో పర్యటించిన విషయం తెలిసిందే. విఠల్ రుక్మిణి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. అయితే, కేసీఆర్ 600 కార్ల కాన్వాయ్తో అక్కడకు వెళ్లడంపై ఎన్సీపీ (NCP) చీఫ్ శరద్ పవార్ విమర్శలు గుప్పించారు.
పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి తమ ప్రాంతానికి వచ్చి పూజలు చేసుకోవడంలో ఎలాంటి అభ్యంతరమూ లేదని శరద్ పవార్ అన్నారు. కానీ, అన్ని వాహనాలతో బలప్రదర్శన చేసిన తీరు ఆందోళనకరమని చెప్పారు. ఇరు రాష్ట్రాల మధ్య సహకారాన్ని మరింత బలపర్చడంపై దృష్టి పెట్టి, కేసీఆర్ మహారాష్ట్రలో పర్యటిస్తే బాగుండేదని అన్నారు.
మంగళవారం కేసీఆర్ నిర్వహించిన ర్యాలీలో ఎన్సీపీ మాజీ నేత భగీరథ్ భాల్కే బీఆర్ఎస్ లో చేరడంపై శరద్ పవార్ ను మీడియా ప్రశ్నించింది. 2021 మహారాష్ట్ర పందర్పూర్ ఉప ఎన్నికలో ఎన్సీపీ టికెట్ మీద భాల్కే పోటీ చేసి ఓడిపోయారు.
ఆయన ఎన్సీపీని వీడడం పట్ల చింతిచాల్సిన అవసరం లేదని శరద్ పవార్ అన్నారు. ఆ ఉప ఎన్నికలో భాల్కేకు టికెట్ ఇవ్వడాన్ని తమ తప్పుడు ఎంపికగా ఆయన అభివర్ణించారు. ఆ విషయాన్ని తాము తర్వాత గుర్తించామని చెప్పారు. ఈ విషయంపై తాను ఇంకా మాట్లాడదల్చుకోలేదని అన్నారు.