భారత్ లో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. 24 గంటల్లో 9000 కేసులు
భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకూ కరోనా పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య పెరుగుతోంది. 24 గంటల్లో 8,909 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 217 మరణాలు సంభవించడంతో మృతుల సంఖ్య 5,815కు చేరింది. బుధవారం నాటికి కరోనా కేసుల మొత్తం సంఖ్య 2,07,615కు చేరింది.
వీటిలో 1,01,497 మంది చికిత్స పొందుతున్నారు. 1,00,302 మంది కోలుకున్నారు. మొత్తం పాజిటివ్ కేసులతో పోల్చితే 48.31 శాతం మంది కోలుకున్నారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల అత్యధికంగా ప్రభావితమైన దేశాల్లో భారత్ ఏడో స్థానంలో కొనసాగుతున్నది. భారత్లో జూన్ 15 నుంచి రోజూ 15 వేలకుపైగా కేసులు నమోదు కావచ్చని చైనా పరిశోధకులు తెలిపారు.
గన్సు ప్రావిన్స్లోని లాన్జౌ యూనివర్సిటీ బృందం ప్రపంచ వ్యాప్తంగా 180 దేశాల్లో రోజువారీ కరోనా కేసుల నమోదు అంచనా వ్యవస్థను రూపొందించింది. దీని ప్రకారం భారత్లో జూన్ 2 నుంచి రోజుకు 9,291 పాజిటివ్ కేసుల వరకూ నమోదవుతాయని అంచనా వేసింది.
బుధవారం (జూన్ 3, 2020) కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొన్న 8,909 సంఖ్యకు ఈ అంచనా దగ్గరగా ఉండటం గమనార్హం. అలాగే మే 28 నుంచి 24 గంటల్లో 7,607 వైరస్ కేసులు నమోదవుతాయని అంచనా వేయగా, కేంద్రం శుక్రవారం వెల్లడించిన 7,467 సంఖ్యకు ఇది చాలా దగ్గరగా ఉండటం గమనార్హం.