ఫింగర్ -4 నుంచి వెనక్కి వెళ్లేందుకు చైనా నిరాకరణ…LAC వద్ద భారత్ హైఅలర్ట్

  • Published By: venkaiahnaidu ,Published On : July 16, 2020 / 06:15 PM IST
ఫింగర్ -4 నుంచి వెనక్కి వెళ్లేందుకు చైనా నిరాకరణ…LAC వద్ద భారత్ హైఅలర్ట్

చైనా ఇంకా జిత్తులమారి వేషాలు వేస్తూనే ఉంది. పాంగాంగ్ త్సో లోని ఫింగర్- 4 ప్రాంతం నుండి వెనక్కి వెళ్లేందుకు చైనా నిరాక‌రించింది. దీంతో భార‌త సైన్యం హై అలర్ట్ అయింది. లడక్ ‌లోని వాస్తవ నియంత్రణ రేఖ వెంబ‌డి భారత్, చైనాల‌ మధ్య ఉద్రిక్తతలు రాబోయే రోజుల్లో మ‌రింత‌ పెరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. చైనా ఆర్మీ నుండి వచ్చే ముప్పును నివారించడానికి హై అల‌ర్ట్ లో ఉన్న భార‌త సైన్యం తూర్పు ల‌డ‌క్ స‌రిహ‌ద్దులో ట్యాంకుల‌ను మోహ‌రిస్తుంది.

భారత్‌, చైనాల మ‌ధ్య కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు మంగళవారం ఉదయం మొదలై దాదాపు 15గంటలపాటు సుదీర్ఘంగా కొన‌సాగి బుధవారం తెల్ల‌వారుజామున ముగిశాయి. అయితే ఈ చర్చల సమయంలో చైనా ఫింగర్ 4 నుండి వెనక్కి తగ్గేది లేద‌ని స్పష్టం చేసిన‌ట్లుగా ఆర్మీ వర్గాలు తెలిపాయి. గాల్వన్ వ్యాలీ, హాట్‌స్ప్రింగ్స్, గోగ్రా ప్రాంతాల నుంచి చైనా ద‌ళాలు పూర్తిగా వైదొల‌గాల‌ని భార‌త్ డిమాండ్ చేసింది.

చైనా సైన్యం కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుని భారత సైన్యం తీవ్ర అప్రమత్తంగా ఉంది. భారత భూభాగాల్లో చైనా సైనికుల చొరబాటును ఆపడానికి తూర్పు లడఖ్‌లో సుమారు 60 వేల మంది సైనికులను మోహ‌రించారు. అదేవిధంగా ఎల్ఏసి సమీపంలో భీష్మ ట్యాంకులు, అపాచీ అటాక్ హెలికాప్టర్లు, సుఖోయ్ ఫైటర్ జెట్‌లు, చినూక్, రుద్ర హెలికాప్టర్లను మోహరించింది.

మరోవైపు, కేంద్రరక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రేపు, ఎల్లుండి లడక్, జమ్ముక‌శ్మీర్‌లో పర్యటించనున్నారు. ఈ నేప‌థ్యంలో ఎల్ఏసీ వెంట ఉన్న పరిస్థితులను వివ‌రించేందుకు చీఫ్ ఆఫ్ నార్తర్న్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ వైకె జోషి ఢిల్లీ చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర సీనియర్ ప్రభుత్వ అధికారులను కలిసి అక్క‌డి ప‌రిస్థితుల‌ను వివ‌రించ‌నున్నారు.