కరోనా టీకాతో నపుంసకులవుతారు – సమాజ్ వాదీ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు, ఖండించిన కేంద్ర మంత్రి

కరోనా టీకాతో నపుంసకులవుతారు – సమాజ్ వాదీ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు, ఖండించిన కేంద్ర మంత్రి

coronavirus vaccine : కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే…నపుంసకులు అవుతారంటూ సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్సీ అశుతోష్ సిన్హా సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్ బీజేపీది కాబట్టి..దాన్ని తాను తీసుకోనని ఇప్పటికే ఆ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా..ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అశుతోష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనిని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఖండించారు. ఇవన్నీ ఊహాగానాలని, జనాలు వీటిని పట్టించుకోవద్దని హర్షవర్దన్ వెల్లడించారు.

ఓ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అశుతోష్ సిన్హా మాట్లాడారు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీని నమ్మలేమని, తమ నాయకుడు అఖిలేష్ యాదవ్ వ్యాక్సిన్ తీసుకోనంటున్నారంటే..ఏవైనా వాస్తవాలు తెలిసి ఉంటాయని తన నమ్మకమన్నారు. ఈ వ్యాక్సిన్ ప్రజలకు హానీ చేస్తుందని, కోవిడ్ టీకా తీసుకుంటే నపుంసకులవుతారని, పార్టీ కార్యకర్తలే కాక..రాష్ట్ర ప్రజలందరూ టీకాకు దూరంగా ఉండాలంటూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఒక్కసారిగా ఈయన చేసిన కామెంట్స్ హల్ చల్ చేశాయి. దీనిపై వివరణ ఇచ్చేందుకు స్వయంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ రంగంలోకి దిగాల్సి వచ్చింది.

ఎమ్మెల్సీ అశుతోష్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కరోనా టీకా తీసుకుంటే..నపుంసకులు అవుతారని శాస్త్రవేత్తలు ఎవరూ చెప్పలేదని, ఇందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని వివరణనిచ్చారు. నిరాధారమైన ఇలాంటి ఊహాగానాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, టీకా వేయించుకున్న తర్వాత..స్వల్ప జ్వరం, టీకా వేయించుకున్న ప్రాంతంలో కొద్దిగా నొప్పి మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారాయన.
2021, జనవరి 16వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమౌతున్న సంగతి తెలిసిందే. అయితే..ఈ టీకాపై ప్రజల్లో ఇప్పటికీ సందేహాలు నెలకొన్నాయి. రాజకీయ నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండడంతో మరింత గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి.