దావూద్ పూర్వీకుల ఇల్లు వేలం, రూ. @ 11.20 లక్షలు

  • Published By: madhu ,Published On : November 11, 2020 / 09:30 PM IST
దావూద్ పూర్వీకుల ఇల్లు వేలం, రూ. @ 11.20 లక్షలు

Dawood Ibrahim in Ratnagiri auctioned : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పూర్వీకులకు చెందిన ఇల్లు ఇబ్రహీం మ్యాన్షన్ తో పాటు మరో ఐదు స్థిరాస్తులను వేలం వేశారు. ఆన్ లైన్ ద్వారా ఈ వేలం పాట నిర్వహించారు. ఢిల్లీకి చెందిన లాయర్ అజయ్ శ్రీవాస్తవ రూ. 11.20 లక్షలకు కొనుగోలు చేశారు. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలోని ముంబ్కే గ్రామంలో ఉంది. ఈ సందర్భంగా అజయ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ..దావూద్ కు సంబంధించిన ఆస్తులను కొనడానికి తాము భయపడడం లేదన్నారు.



గతంలో దావూద్ ఆస్తులకు వేలం వేసినప్పుడు కూడా పాల్గొని అతని ఆస్తులను కొనుగోలు చేశారు. దావూద్ తల్లి అమీన్ బీ, సోదరి హసినా పర్కార్ పేరిట ఉన్న 25 గుంటల భూమిని రూ. 4.30 లక్షలకు కొనుగోలు చేశారు. అప్పుడు దావూద్ అనుచరుల నుంచి బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తప్పకుండా పోరాడుతామని, ఈ విషయంలో ఏజెన్సీలకు సహాయపడుతామని చెప్పారు.



దావూద్ కుటుంబం 1983లో ముంబాయికి వెళ్లకముందు ఈ ఇంట్లో నివాసం ఉంది. దావూద్ సన్నిహితుడు ఇక్బాల్ మిర్చి అపార్ట్ మెంట్, రత్నగిరి జిల్లాలోని లోటే గ్రామంలో ఓ ప్లాట్ సాంకేతిక కారణాల వల్ల అమ్ముడు పోలేదు. ఈ రెండింటిని మళ్లీ వేలం వేస్తామని అధికారులు వెల్లడించారు.