మరోసారి ఐటీ రిటర్న్ అప్లై గడువు పొడిగింపు
IT RETURNS అప్లికేషన్కు ఇంకా గడువు పెంచుతూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరక్ట్ ట్యాక్స్ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరం (అసెస్మెంట్ ఇయర్ 2020-21)కి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ దాఖలు చేయడానికి డిసెంబర్ 31 వరకు గడువు పొడిగించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇలా రిటర్నులు దాఖలు గడువును పెంచడం ఇది రెండోసారి.
కొవిడ్ మహమ్మారి కారణంగా ఏర్పడిన తలెత్తిన సమస్యలను దృష్టిలో ఉంచుకొని మొదటిసారి ఈ గడువును జులై 31 నుంచి నవంబర్ 30కి పెంచారు. దానిని రెండోసారి డిసెంబర్ 31 వరకు పొడిగించారు. ఖాతాలు ఆడిట్ చేయాల్సిన అవసరం ఉన్న పన్ను చెల్లింపుదారులకు చివరిసారిగా ఐటీఆర్లను దాఖలు చేయడానికి 2021 జనవరి 31 వరకు గడువు ఇచ్చారు.
ఇన్కమ్ ట్యాక్స్ చట్టం కింద దాఖలు చేయాల్సిన ట్యాక్స్ ఆడిట్ రిపోర్టు, అంతర్జాతీయ, దేశీయ లావాదేవీలకు సంబంధించిన ఆడిట్ రిపోర్టుల దాఖలు గడువునూ డిసెంబర్ 31 వరకు పొడిగించారు. సెల్ఫ్ అసెస్మెంట్ తో పన్ను చెల్లించే వారికీ, పన్ను బకాయి రూ.లక్షవరకు ఉంటే ఆ చెల్లింపు గడువును 2021 జనవరి 31వరకు పెంచారు.
జీఎస్టీ వార్షిక రిటర్నులు కూడా..: 2018-19 ఆర్థిక సంవత్సరానికి జీఎస్టీ వార్షిక రిటర్నులు (ఫామ్ జీఎస్టీఆర్-9), రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ (ఫామ్ జీఎస్టీర్-9సి) దాఖలుకు గడువు తేదీని కూడా డిసెంబర్ 31 వరకు పెంచుతూ సెంట్రల్ ఫైనాన్స్ మినిస్ట్రీ శనివారం ఆర్డర్లు జారీచేసింది.