పసిడి వెలవెలబోతోంది : 25 ఏళ్ల కనిష్ఠానికి చేరిన బంగారం గిరాకీ

పసిడి వెలవెలబోతోంది : 25 ఏళ్ల కనిష్ఠానికి చేరిన బంగారం గిరాకీ

Decreased demand for gold : పసిడి వెలవెలబోతోంది. ఆర్థిక కార్యకలాపాలు మందగించిన ఫలితంగా 2020లో భారత్‌లో పసిడి గిరాకీ 25 ఏళ్ల కనిష్ఠానికి చేరింది. పసిడి కొనుగోలుదారులకు ఇది ఊరట కలిగించే అంశమే. పసిడి ధర బాటలోనే వెండి ధర కూడా పయనిస్తోంది. బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

కరోనా మహమ్మారి వల్ల ఏర్పడ్డ ఆర్థిక అనిశ్చితిని దృష్టిలో పెట్టుకుని, పెట్టుబడులను ఇటువైపు మళ్లించడంతో అంతర్జాతీయంగా పసిడి ధర రికార్డు గరిష్ఠాలకు చేరింది. దేశీయంగా లాక్‌డౌన్‌తో ఆర్థిక కార్యకలాపాలు మందగించిన ఫలితంగా 2020 మొత్తంమీద భారత్‌లో పసిడి గిరాకీ 25 ఏళ్ల కనిష్ఠానికి చేరి, 446.4 టన్నులకు పరిమితమైంది. 2019 గిరాకీ 690.4 టన్నులతో పోలిస్తే 35 శాతం తక్కువని ప్రపంచ స్వర్ణ మండలి… డబ్ల్యూజీసీ విడుదల చేసిన గోల్డ్‌ డిమాండ్‌ ట్రెండ్స్‌ నివేదిక వెల్లడించింది.

విలువ పరంగా ఈ తేడా 14 శాతమే తగ్గింది. ధర బాగా పెరిగి, 2020లో 10 గ్రాములు 50 వేల రూపాయల దరిదాపుల్లో కదులుతోంది. ఆభరణాలకు గిరాకీ 42 శాతం మేర క్షీణించి 315.9 టన్నులకు, పెట్టుబడుల గిరాకీ 11 శాతం తగ్గి 130 టన్నులకు పరిమితమైంది. పండుగల సీజను, పెళ్లిళ్ల కారణంగా అక్టోబరు-డిసెంబరులో గిరాకీ పుంజుకుంది. ఈ సమయంలో వినియోగం 2019తో పోలిస్తే 4 శాతమే తగ్గి 186 టన్నుల వద్దే ఉంది. అదే సమయంలో ఆభరణాల గిరాకీ 8 శాతం తగ్గి 137 టన్నులకు చేరింది. పెట్టుబడుల గిరాకీ 8 శాతం పెరిగి 49 టన్నులకు చేరింది.

2019 నాటి 211 టన్నులతో పోలిస్తే గతేడాదిలో ముడి పసిడి దిగుమతులు 114 టన్నులకు తగ్గాయి. 2020లో మొత్తం 95 టన్నుల బంగారం పునర్వినియోగానికి వచ్చింది. అంతక్రితం ఏడాది 119 టన్నుల పసిడి ఇలా వినియోగమైంది. డాలర్‌ విలువకు తోడు పన్నుల వల్ల దేశీయంగా పసిడి ధర మరింత అధికమైంది. ఫలితంగా వినియోగదార్లు పాత బంగారాన్ని… ఆభరణాలను విక్రయించడానికి బదులుగా పెళ్లిళ్లు ఇతర వేడుకల్లో సన్నిహితులకు బహుమతి కింద ఇవ్వడానికి మొగ్గుచూపారు. తమ ఆర్థిక అవసరాలకు పసిడిని అమ్మకుండా.. పసిడి రుణాలు తీసుకున్నారు. అందుకే పునర్వినియోగం తగ్గింది.

అంతర్జాతీయంగా పసిడికి గిరాకీ గతేడాది 11 ఏళ్ల కనిష్ఠానికి చేరి 3 వేల 759 టన్నులకే పరిమితమైంది. 2019లో వినియోగ గిరాకీ 4 వేల 386 టన్నులుగా ఉంది. 2009 తరవాత 4 వేల టన్నుల కంటే గిరాకీ తగ్గడం మళ్లీ ఇప్పుడే. గతేడాది భారత్‌లోకి అక్రమ మార్గంలో వచ్చే పసిడి పరిమాణం తగ్గింది. లాక్‌డౌన్‌లు, విమాన, నౌకాయానాల నిలిపివేత, కఠిన పరిశీలనల కారణంగా ఈ సారి 25 టన్నుల్లోపే ఇలా వచ్చిందన్నది డబ్ల్యూజీసీ అంచనా. 2019లో దాదాపు 115-120 టన్నుల మేర పసిడి దొంగచాటుగా వచ్చినట్లు అంచనా.