e-RUPI : కొత్త పేమెంట్ వ్యవస్థ..”ఈ రూపీ”ని ప్రారంభించిన ప్రధాని మోదీ
డిజిటల్ లావాదేవీలు సులభతరం చేసేందుకు తీసుకువచ్చిన ఎలక్ట్రానిక్ వోచర్ 'ఈ-రూపీ'ని సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.
e-RUPI డిజిటల్ లావాదేవీలు సులభతరం చేసేందుకు తీసుకువచ్చిన ఎలక్ట్రానిక్ వోచర్ ‘ఈ-రూపీ’ని సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ..భారత్ 75 ఏళ్ల స్వాతంత్య వేడుకలు జరుపుకోనున్న తరుణంలో ఈ విధానాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. దేశంలో డిజిటల్ చెల్లింపులు, ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల అమలులో ఈ-రూపీ ఓచర్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. దీని వల్ల పారదర్శకంగా, ఎలాంటి అవకతవకలు లేకుండా ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరుతుందన్నారు. ఎల్పీజీ నుంచి రేషన్, పింఛన్ వరకు 300 పథకాల్లో ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీ చేస్తోందని మోదీ తెలిపారు.
ఇక, ప్రభుత్వ వ్యవస్థల్లోనే కాకుండా ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు కూడా ఈ-రూపీ విధానాన్ని వినియోగించవచ్చని మోదీ తెలిపారు. ప్రభుత్వేతర సంస్థ లేదా ప్రైవేట్ వ్యక్తులు ఎవరికైనా వారి విద్య లేదా వైద్య చికిత్సలో మద్దతు ఇవ్వాలనుకుంటే, వారు నగదు ఇవ్వడానికి బదులుగా ఐ-రూపీని ఉపయోగించాలని ప్రధాని అన్నారు. విరాళంగా ఇవ్వబడిన మొత్తం చెప్పిన పనికి మాత్రమే ఉపయోగించబడుతుందని ఇది నిర్ధారిస్తుందని వివరించారు.
ప్రారంభంలో, ఇది ఆరోగ్య లబ్ధిదారులకు వర్తిస్తుందన్నారు. ఎవరైనా 100 మంది పేదలకు టీకాలు వేయడంలో సహాయం చేయాలనుకుంటే, వారికి e-RUPI వోచర్ ఇవ్వవచ్చునని, దీంతో డబ్బు ఆ ప్రయోజనం కోసం మాత్రమే ఉపయోగించబడుతుందని తెలిపారు. కాలక్రమేణా, ఈ ప్లాట్ఫామ్కు మరిన్ని సౌకర్యాలు(ఆరోగ్య సౌకర్యాలలో సహాయం చేయడం, ఆహారాన్ని దానం చేయడం వంటివి) జోడించబడతాయని తెలిపారు.
ఈ-రూపీ యొక్క పెద్ద ప్రయోజనం ఏమిటంటే, డబ్బును ఏ ప్రయోజనం కోసం పంపింస్తారో దాని కోసమే ఆ డబ్బుని ఉపయోగించవచ్చు. ప్రభుత్వం.. పుస్తకాల కోసం డబ్బు పంపినట్లయితే, ఈ-రూపి కేవలం పుస్తకాలు మాత్రమే కొనుగోలు చేయబడుతుందని నిర్ధారిస్తుంది. యూనిఫామ్ కోసం డబ్బు పంపబడితే, ఎరువుల కోసం డబ్బు పంపినట్లయితే ఆ నగదుని దాని కొనుగోలుకి మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుందని మోడీ అన్నారు.
ఇంతకుముందు మన దేశంలో కొంతమంది ధనవంతులకు మాత్రమే సాంకేతికత అందుబాటులో ఉండేదని మోదీ తెలిపారు. కానీ నేడు ఆ పరిస్థితి మారిందన్నారు. నేడు మనం టెక్నాలజీని పేదలకు సహాయం చేయడానికి సాధనంగా, వారి పురోగతికి ఒక సాధనంగా చూస్తున్నామన్నారు. సాంకేతికత వల్ల పారదర్శకత సాధ్యమవుతోందన్నారు. అత్యాధునిక టెక్నాలజీ సాయంతో 21వ శతాబ్ధంలో ఇండియా ముందుకు వెళ్తున్న తీరుకు ఈ-రూపీని ఉదాహరణగా భావించవచ్చు అని ప్రధాని చెప్పారు.
కాగా, నగదు రహిత లావాదేవీలకు ప్రోత్సాహం, మధ్యవర్తిత్వ సాధనాల ప్రమేయాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ-రూపీ (e-RUPI) అనే కొత్త పేమెంట్ వ్యవస్థను కేంద్రం రూపొందించింది. ఈ వ్యవస్థను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, నేషనల్ హెల్త్ అథారిటీ సహకారంతో అభివృద్ధి చేశారు. ఈ-రూపీ అంటే.. ఒక క్యూఆర్ కోడ్ లేదా ఎస్ఎంఎస్ స్ట్రింగ్ ఓచర్ లను లబ్ధిదారుడి మొబైల్ ఫోన్ కి పంపిస్తారు. వీటినే ఈ-రుపీగా భావించవచ్చు. అందులో నిర్దేశిత డబ్బును ముందే లోడ్ చేసి పెడతారు. ఒక రకంగా చెప్పాలంటే ఇవి ప్రీపెయిడ్ గిఫ్ట్ ఓచర్ల వంటివే. ఈ ఓచర్ లేదా క్యూఆర్ కోడ్ను లబ్ధిదారుడు తనకు అవసరమైన చోట అంటే సంబంధిత సేవలు అందేచోట వినియోగించుకోవచ్చు. దీనికి బ్యాంకు, యాప్, ఆన్లైన్ బ్యాంకింగ్ వంటి మధ్యవర్తిత్వ వేదికలేవీ అవసరం లేదు. ప్రస్తుతం 8 బ్యాంకుల ద్వారా ఈ-రూపీ సేవలు అందించనున్నారు.