ఆదాయపు పన్ను రిటర్నుల గడువు పొడిగింపు
దేశంలో ఆదాయపు పన్ను రిటర్నుల గడువును ఆదాయపు పన్ను విభాగం పొడిగించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికిగాను ఐటీ రిటర్నులు దాఖలు చేయడానికి తుది గడువును (నవంబర్ 30, 2020)గా నిర్ణయించింది. ఈ మేరకు ఐటీ శాఖ ట్విటర్ ద్వారా వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి దృష్ట్యా నిర్ణయం తీసుకొన్నామని ఐటీ శాఖ తెలిపింది.
ఇది పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనకరంగా ఉంటుందని వెల్లడించింది. వాస్తవానికి ఆదాయ పన్ను రిటర్న్లను (జూలై 31, 2020)లోపు చెల్లించాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ కారణంగా దేశంలో ఆర్థిక పరిస్థితులు దెబ్బతినడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐటీ శాఖ వెల్లడించింది.
దీంతోపాటు 2019-20 టీడీఎస్, టీసీఎస్ స్టేట్మెంట్లకు కూడా గడువును (ఆగస్టు 15, 2020) వరకు పొడిగించారు. ఆదాయ పన్నుచెల్లింపు గడువు తేదీలను పెంచనున్నట్లు ప్రభుత్వం గత వారమే స్పష్టం చేసింది. ఈ మేరకు ఇప్పుడు నిర్ణయం చేసింది.