ప్రాణాలమీదికి తెచ్చిన పెళ్లి విందు: ఆస్పత్రి ఫుల్
ఓ పెళ్లి విందు ప్రాణాలమీదికి తెచ్చింది. ఓ పెళ్లి వేడుకకు వెళ్లిన పలువురు పెళ్లిలో పెట్టిన విందు అనంతరం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ అవ్వటంతో వారందరినీ సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది.
నారఖీ పోలీస్ స్టేషన్ పరిధిలోని డూమర్ హరీనగర్ లో ఓ వివాహం జరిగింది. పెళ్లిలో ఏర్పాటు చేసిన విందు ఆరగించినవారంతా కొద్ది సేపటికే వాంతులు చేసుకుకున్నారు.దీంతో వీరినందరినీ యూపీలోని ఫిరోజాబాద్ మెడికల్ కాలేజీకి చెందిన ట్రామా సెంటర్ ఉన్న ఆస్పత్రికి తరలించారు స్థానికులు. వందమందికి పైగా ఫుడ్ పాయిజనింగ్ బాధితులు చేరారు. వృద్ధులు, చిన్నారులు, మహిళలు ఎక్కువమంది ఉన్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంత భారీ సంఖ్యలో బాధితులు ఆసుపత్రికి రావడంతో అప్రమత్తమైన వైద్య సిబ్బంది వెంటనే వారికి చికిత్స ప్రారంభించింది.
కాగా..ఆసుపత్రిలో తగిననన్ని బెడ్లు లేకపోవడంతో ఒకే బెడ్పై ఇద్దరు ముగ్గురిని పడుకోబెట్టి మరీ వారికి చికిత్సనందిస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ పాండ్యా మాట్లాడుతూ రాత్రి సమయంలో ఆస్పత్రికి ఫుడ్పాయిజనింగ్ బాధితులు వందమందికి పైగా వచ్చారనీ వారికి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో వారు తాగిన నీరు..తిన్న ఆహారపదార్థాల శాంపిళ్లను సేకరించి పరిక్షిస్తున్నామని తెలిపారు.