తెలంగాణతో సహా 17 రాష్ట్రాల్లో భారీ వర్షాలు

  • Published By: chvmurthy ,Published On : September 24, 2019 / 04:14 AM IST
తెలంగాణతో సహా 17 రాష్ట్రాల్లో భారీ వర్షాలు

దేశంలోని 17 రాష్ట్రాల్లో సెప్టెంబర్ 24 మంగళవారం భారీవర్షాలు కురుస్తాయని ఢిల్లీలోని కేంద్ర వాతావరణశాఖ హెచ్చరించింది. ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ  విడదల చేసిన బులెటిన్ లో పేర్కోంది.

ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, విదర్భ, ఛత్తీస్‌ఘడ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో మంగళవారం కుంభవృష్టి కురుస్తుందని అధికారులు తెలిపారు. అసోం, మేఘాలయ, మహారాష్ట్ర, గోవా, ఆంధ్రప్రదేశ్, యానాం, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ నుంచి, అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆల్ ఇండియా వార్నింగ్ బులెటిన్ లో అధికారులు వివరించారు.

బీహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు పిడుగులు పడే అవకాశముంది. అరేబియా సముద్రంలో గంటకు 75 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు.

కాగా… వచ్చే మూడ్రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.   దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర కోస్తా తమిళనాడు తీరాలకు దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానిని ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో సముద్రమట్టానికి 4.5 కి.మీ. ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. ఇది మరింత ఎత్తునకు వెళ్లి నైరుతి వైపునకు వంపు తిరిగి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దీని ప్రభావంతో వచ్చే మూడ్రోజుల్లో తెలంగాణలోని చాలాచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నదని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు వివరించారు.