18 రోజుల్లోనే 40 లక్షలు మందికి.. అత్యంత వేగంగా కరోనా వ్యాక్సిన్ వేసిన దేశంగా ఇండియా​ రికార్డ్​

18 రోజుల్లోనే 40 లక్షలు మందికి.. అత్యంత వేగంగా కరోనా వ్యాక్సిన్ వేసిన దేశంగా ఇండియా​ రికార్డ్​

India records over 44 lakh corona vaccination: దేశవ్యాప్తంగా కరోనా టీకాలు వేసే ప్రక్రియ కొనసాగుతోంది. వ్యాక్సినేషన్ కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో ఇండియా రికార్డ్ నెలకొల్పింది. అత్యంత వేగంగా(18 రోజుల్లోనే 40లక్షల మందికి) కరోనా టీకాలు వేసిన దేశంగా భారత్ రికార్డ్ క్రియేట్ చేసింది. దేశవ్యాప్తంగా 47 శాతం మంది ఆరోగ్య కార్యకర్తలకు కరోనా టీకాలు వేశారు. బుధవారం(ఫిబ్రవరి 3,2021) మొత్తంగా 2లక్షల 48వేల 662 మంది టీకాలు వేయించుకున్నారు. దీంతో మొత్తంగా టీకా తీసుకున్న వారి సంఖ్య 44 లక్షలు దాటింది. ఇప్పటిదాకా కరోనా టీకాల కోసం 92లక్షల 61వేల 227 మంది డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలు, సిబ్బంది నమోదు చేసుకున్నారు.

అత్యంత వేగంగా నాలుగు మిలియన్ల (40 లక్షల) మందికి టీకాలు వేసిన దేశంగా భారత్ నిలిచింది. కేవలం 18 రోజుల్లోనే ఆ మార్క్ ను దాటి ప్రథమ స్థానంలో నిలిచింది. మంగళవారం (ఫిబ్రవరి 2) నాటికే భారత్ ఆ ఫీట్ ను సాధించింది. ఈ జాబితాలో అమెరికా రెండో స్థానాన్ని సాధించింది. ఆ దేశం 20 రోజుల్లో 40 లక్షల మందికి కరోనా టీకాలు వేసింది. బ్రిటన్, ఇజ్రాయెల్ లకు 39 రోజుల సమయం పట్టింది.

ఎక్కువ మంది లబ్ధిదారులున్న రాష్ట్రాల జాబితాలో మధ్యప్రదేశ్ 69.4 శాతం మందికి టీకాలు వేసి ప్రథమ స్థానాన్ని సాధించింది. ఆ తర్వాత 64.7 శాతంతో రాజస్థాన్ రెండో స్థానంలో నిలిచింది. సంఖ్యా పరంగా చూస్తే మాత్రం ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం 4.63 లక్షల మందికి కరోనా టీకాలు వేసింది. మొత్తం 9 లక్షల మంది ఆరోగ్య సిబ్బంది ఉండగా.. అందులో 51 శాతం మంది టీకాలు తీసుకున్నారు.

మహారాష్ట్రలో కేవలం 34శాతం మందికే టీకాలు వేశారు. ఛత్తీస్ గఢ్ లో29 శాతం, గోవా 28.3 శాతం, ఢిల్లీ 26.6%, తమిళనాడులో 22.6%, పుదుచ్చేరిలో 12.3% మందే టీకాలు తీసుకున్నారు. ఇక, ఇప్పటిదాకా మణిపూర్ లో అతి తక్కువగా 10 శాతం మందికే టీకాలు వేశారు.

మన దేశంలో జనవరి 16న వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 18 రోజుల్లో 76వేల 516 వ్యాక్సినేషన్ సెషన్స్ నిర్వహించారు. తొలుత ఏప్రిల్ నాటికి మూడు కోట్ల మందికి(ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ సిబ్బంది) టీకా వేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. దేశవ్యాప్తంగా 92లక్షల 61వేల మంది ఆరోగ్య కార్యకర్తలకు టీకా వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆరోగ్య మంత్రి అశ్విని చౌబే రాజ్యసభలో తెలిపారు. ఇందులో ఇప్పటివరకు 44శాతం మందికి మొదటి డోస్ టీకా వేశామన్నారు. నాలుగు వారాలు లేదా 28 రోజుల వ్యవధిలో రెండో డోస్ ఇస్తామని తెలిపారు.