లైంగిక దాడి కేసుల్లో వివాదస్పద తీర్పులు..ప్రమోషన్ కి ఎసరు

లైంగిక దాడి కేసుల్లో వివాదస్పద తీర్పులు..ప్రమోషన్ కి ఎసరు

గత నెలలో బాలిక‌ల‌పై లైంగిక‌దాడి కేసుల్లో బాంబే హైకోర్టు నాగ్ పూర్ బెంచ్ జడ్జి జ‌స్టిస్ పుష్ప గ‌నేదివాలా వివాదాస్ప‌ద తీర్పులు ఇచ్చి దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే ఆ తీర్పులే ఇప్పుడు ఆమె పదోన్నతికి ఎసరు పెట్టాయి. ఆమెకు పదోన్నతి కల్పించకుండా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పుష్ప మరో ఏడాదిపాటు అద‌న‌పు న్యాయ‌మూర్తిగా కొనసాగనున్నారు. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

జస్టిస్‌ పుష్ప బాంబే హైకోర్టు నాగ్ పూర్ బెంచ్ అద‌న‌పు న్యాయ‌మూర్తిగా కొనసాగుతున్నారు. సాధారణంగా అద‌న‌పు న్యాయ‌మూర్తి ప‌ద‌వీకాలం రెండేళ్లు. అద‌న‌పు న్యాయ‌మూర్తిగా ఆమె ప‌ద‌వీకాలం శుక్ర‌వారం(ఫిబ్రవరి-12,2021)తో ముగిసింది. ఈ ప‌ద‌వీకాలం ముగిసిన త‌ర్వాత శాశ్వ‌త న్యాయ‌మూర్తిగా ఆమెకు ప‌దోన్న‌తి క‌ల్పించాలి. కానీ పదోన్నతి కల్పించకుండా కేంద్ర న్యాయశాఖ ఆమెకు షాకిచ్చింది.

జ‌స్టిస్ పుష్ప‌కు శాశ్వ‌త న్యాయ‌మూర్తిగా ప‌దోన్న‌తి క‌ల్పించ‌కుండా.. మ‌రో ఏడాది కాలం పాటు ఆమె అద‌న‌పు న్యాయ‌మూర్తిగానే కొన‌సాగుతార‌ని కేంద్రం తెలిపింది. జ‌స్టిస్ పుష్పకు శాశ్వ‌త న్యాయ‌మూర్తిగా ప‌దోన్న‌తి ల‌భించ‌క‌పోవ‌డానికి గత నెలలో ఆమె ఇచ్చిన వివాదాస్పద తీర్పులేననేది బహిరంగ రహాస్యం. అయితే ఆమెను మ‌రో రెండేళ్ల పాటు అద‌న‌పు న్యాయ‌మూర్తిగా కొన‌సాగించాల‌ని సుప్రీం కొలిజీయం కేంద్రానికి సిఫార‌సు చేసింది. కానీ కేంద్రం మాత్రం ఏడాది పాటు మాత్ర‌మే ప‌ద‌వీ కాలాన్ని పొడిగించ‌డం గ‌మ‌న్హారం.

గతంలో జస్టిస్‌ పుష్ప బ్యాంకులు, బీమా కంపెనీలకు న్యాయవాదిగా పని చేసేవారు. దీంతో పాటు కొన్ని కళాశాలల్లో అధ్యాపకురాలిగా కొనసాగుతున్నారు. 2007లో జిల్లా జడ్జిగా ఆమె నియమితులు కాగా ఫిబ్రవరి 13, 2019లో బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. పదోన్నతి వచ్చి ఉంటే శాశ్వత న్యాయమూర్తిగా ఆమె నియమితులయ్యే వారు.

గతనెలలో ఆమె ఇచ్చిన వివాదాస్పద తీర్పులు

‘నేరుగా బాలిక‌ శ‌రీరాన్ని తాక‌న‌ప్పుడు ఆ కేసు పోక్సో(POCSO)చట్టం కింద‌కు రాదు’అని జ‌స్టిస్ పుష్ప తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు దేశవ్యాప్తంగా వివాదాస్ప‌ద‌మైంది. బాలిక చేతిని పట్టుకుని, అతను ప్యాంట్ జిప్ తెరిచినంత మాత్రాన పోక్సో చట్టం కింద దాన్ని లైంగిక దాడిగా పరిగణించలేం అని మరో కేసులో జస్టిస్‌ పుష్ప తెలిపారు.