బహిరంగ ప్రదేశాల్లో పాన్, గుట్కా, ఉమ్మితే కేసు
కరోనా వైరస్ కట్టడిలో భాగంగా కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పొగాకు ఉత్పత్తులను ఇదివరకు మాదిరిగా ఎక్కడ పడితే అక్కడ, రోడ్లపై నమిలి ఉమ్మి వేయటంపై నిషేధం విధించింది. ఈ మేరకు కర్ణాటక ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఇక నుంచి ఈ ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై ఐపీసీ సెక్షన్లు 188, 268, 269, 270 కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. అంతేగాక కర్ణాటక ఎపిడెమిక్ ఆర్డినెన్స్లోని సెక్షన్ 4(2) ప్రకారం కూడా దోషులు శిక్షార్హులవుతారని కర్ణాటక సర్కారు స్పష్టం చేసింది.
దేశంలో కరోనా మహమ్మారి ఇప్పటికే వేగంగా విస్తరిస్తోందని లాక్ డౌన్ సడలింపుల్లో పాన్ షాపులకు అనుమతి ఇచ్చి… పొగాకు ఉత్పత్తులను నమిలి ఉమ్మివేయటం ద్వారా వైరస్ మరింత ఉధృతంగా విస్తరించే ప్రమాదం ఉన్నందున, పొగాకు ఉత్పత్తులను ఉమ్మి వేయడంపై నిషేధం విధించామని కర్ణాటక ప్రభుత్వం వివరించింది. ఇప్పటికే బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలు కూడా పాన్ గుట్కాలను నమిలి ఉమ్మడంపై నిషేధాన్ని అమల్లోకి తెచ్చాయి.