మోడీ..ఉద్యోగమివ్వు..దద్దరిల్లుతున్న ట్విట్టర్

మోడీ..ఉద్యోగమివ్వు..దద్దరిల్లుతున్న ట్విట్టర్

Modi Job Do Hashtag Trending In India

modi దేశంలో నిరుద్యోగ యువకుల సంఖ్య పెరిగిపోతుంది. చదువులు పూర్తి చేసుకున్న యువతకు ఉద్యోగాలు కరువయ్యాయి. దేశం మొత్తంమీద ఉద్యోగుల సంఖ్య 40.6 కోట్లు కాగా..వారిలో 30 ఏళ్లలోపు వారు కేవలం ఐదో వంతు మాత్రమే ఉన్నారు. అంటే ప్రతి ఐదుగురిలో ఒక్కరు మాత్రమే యువత. మిగిలిన నలుగురూ 30 ఏళ్లు పైబడినవారే. అధికారిక లెక్కల ప్రకారం.. 2020 నాటికి దేశంలో నిరుద్యోగిత రేటు 23.74 శాతంగా ఉందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

అయితే దీనిపై నెటిజెన్లు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. కొద్ది రోజులుగా ‘మోడీ.. ఉద్యోగమివ్వు’ (మోడీ జాబ్ దో/మోడీ రోజ్‌గార్ దో) అంటూ పెద్ద ఎత్తున నినదిస్తున్నారు. గత వారం రోజులుగా ట్విట్టర్‌లో ‘మోడీ.. ఉద్యోగమివ్వు’ అనే హ్యాష్‌ట్యాగే టాప్ ట్రెండింగ్‌లో ఉంది. ఈ ఒక్క రోజే ఈ హ్యాష్‌ట్యాగ్‌పై సుమారు 50 లక్షల ట్వీట్లు వచ్చాయి. ఇంకా పెద్ద సంఖ్యలో ట్వీట్లు వస్తూనే ఉన్నాయి. క్షణాల్లో వేల సంఖ్యలో ట్వీట్లు వేస్తున్నారు. ఈ అంశం కొద్ది రోజులుగా ట్విట్టర్‌ను కుదిపివేస్తోంది.

2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు నరేంద్రమోడీ.. ఏటా 2 కోట్ల ఉద్యోగాలంటూ ఇచ్చిన హామీని ప్రధానంగా ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాకుండా మన్మోహన్ ప్రధానిగా ఉన్న కాలంలో నిరుద్యోగం గురించి మోడీ చేసిన ట్వీట్లను, వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. యువత మన్‌ కీ బాత్ వినండి..ప్రసంగాలు, వాగ్దానాలు కాదు ఉద్యోగాలు ఇవ్వండి అంటూ ట్వీట్ల వరద పారిస్తున్నారు. ఆదాయ ఆర్జన కోసం పకోడీలు వేసుకొమ్మని మోడీ చేసిన వ్యాఖ్యలపై మీమ్స్ వేస్తూ నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వం ఈ విషయమై పెదవి విప్పకపోయినప్పటికీ.. అంతర్గతంగా దీనిపై విస్తృత చర్చే జరుగుతోందని సమాచారం.

కేంద్రంలో 2014లో మోడీ అధికారంలోకి వచ్చే సమయానికి దేశంలో నిరుద్యోగ రేటు 5.61శాతం కాగా..2020 డిసెంబరు నాటికి దేశంలోని పట్టణ ప్రాంతాల ప్రజల్లో నిరుద్యోగ రేటు 7.8గా ఉందని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. నిరుద్యోగ యువతలో ఎక్కువగా గ్రాడ్యూయేట్లే ఉన్నారు. దేశ పురోభివృద్ధిలో అత్యంత కీలకమైన 20-24 వయసువారిలో నిరుద్యోగ రేటు ఏకంగా 37 శాతం ఉంది. వారిలో 63 శాతం మంది పట్టభద్రులని ‘సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) రిపోర్ట్ చెబుతోంది. అంటే ప్రతి ముగ్గురిలో ఒక గ్రాడ్యూయేట్ మాత్రమే ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగాల్లో యువత వాటా తగ్గడం దీర్ఘకాలంలో దేశాభివృద్ధిపై తీవ్ర దుష్ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.