ఫింగర్-8వరకు మనదే..రాహుల్ ఆరోపణలపై రక్షణశాఖ క్లారిటీ

Defence Ministry ఈశాన్య లడఖ్ లోని పాంగాంగ్ ఏరియాలో భారత భూభాగం ఫింగర్ 4 వరకేనంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అసత్యమని భారత రక్షణశాఖ శుక్రవారం(ఫిబ్రవరి-12,2021) ప్రకటించింది. భారత భూభాగం ఫింగర్ 8 వరకు ఉందని స్పష్టంచేసింది. భారతదేశ చిత్రపటం ప్రకారం దేశంలో ఇప్పటికే 43 వేల చదరపు కిలోమీటర్ల భూభాగం 1962 నుంచి అక్రమంగా చైనా ఆక్రమణలో ఉన్నదని తెలిపింది. వాస్తవాధీన రేఖ కూడా భారతదేశపు అవగాహన ప్రకారం ఫింగర్ 8 మీదుగా ఉందని..ఫింగర్ 4 మీదుగా కాదని రక్షణశాఖ స్పష్టంచేసింది.
ప్రస్తుత చైనా ఒప్పందంతో కూడా కలిపి… ఫింగర్-8వరకు పాట్రోల్ లేదా గస్తీ నిర్వహించేందుకు హక్కుని భారత్ కలిగి ఉందని తెలిపింది. పాంగాంగ్ సరస్సు యొక్క ఉత్తర ఒడ్డున ఇరుదేశాల శాశ్వత పోస్టులు దీర్ఘకాలంగా మరియు బాగా స్థిరపడి ఉన్నాయని రక్షణశాఖ తెలిపింది. విరుద్ధంగా ఏ భూభాగాన్ని అంగీకరించలేదని, LAC పట్ల గౌరవాన్ని అమలు చేశామని, యథాతథ స్థితిలో ఏకపక్ష మార్పును నిరోధించినట్లు తెలిపింది.
కాగా, లడఖ్ సరిహద్దుల్లో తొమ్మిది నెలలుగా కొనసాగుతున్న ప్రతిష్ఠంభణకు తెరదించుతూ తాజాగా చైనా-భారత్ మధ్య జరిగిన ఒప్పంద విషయాలపై గురువారం పార్లమెంట్ లో రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ చేసిన ప్రకటనపై శుక్రవారం రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో రక్షణశాఖ ఈ మేరకు క్లారిటీ ఇచ్చింది. శుక్రవారం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. భారత బలగాలు ఫింగర్ 4 నుంచి ఫింగర్ 3 వద్ద ఉన్న పర్మనెంట్ బేస్ (ధన్ సింగ్ తాపా పోస్ట్)దగ్గర ఉంటాయని రాజ్ నాథ్ పార్లమెంట్ లో చెప్పారు.
అయితే ఫింగర్ 4 మన భూభాగంలోది. ఆ ప్రాంతాన్ని ప్రధాని చైనాకు ఎందుకు ఇచ్చారు? మన సైనికులు వీరోచితంగా పోరాడి కైలాశ్ పంక్తులను సొంతం చేసుకుంటే.. వారిని ఎందుకు వెనక్కి వచ్చేయమంటున్నారు? ఈ చర్య వల్ల భారత్కు లాభం ఏంటి? వ్యూహాత్మంగా ఎంతో ప్రాముఖ్యం ఉన్న దేప్సాంగ్ ప్రాంతం నుంచి చైనా బలగాలు ఎందుకు వెనక్కి వెళ్లటం లేదు? ప్రధాని భారత భూభాగాన్ని చైనాకు ఇచ్చి.. వారి ముందు తలవంచారు అని రాహుల్ విమర్శించారు. భారత బలగాలు ఫింగర్ 4 నుంచి ఫింగర్ 3కి ఎందుకు వస్తున్నాయో ప్రధాని, రక్షణ మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.