Pashupati Kumar Paras : LJP జాతీయ అధ్యక్షుడిగా పరాస్ ఏకగ్రీవ ఎన్నిక
లోక్జనశక్తి పార్టీ(LJP)లో తిరుగుబావుట ఎగురవేసిన ఎంపీ పశుపతి కుమార్ పరాస్ గురువారం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Pashupati Kumar Paras లోక్జనశక్తి పార్టీ(LJP)లో తిరుగుబావుట ఎగురవేసిన ఎంపీ పశుపతి కుమార్ పరాస్ గురువారం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గంలో ఈ ప్రకటన చేశారు. ఈ సమావేశానికి ముందే అధ్యక్ష పదవికి పశుపతినాథ్ నామినేషన్ దాఖలు చేశారు.
మధ్యాహ్నం 3 గంటల వరకు ఎవరు నామినేషన్ పత్రాలను దాఖలు చేయలేదని.. ఈనేపథ్యంలో పరాస్ను అధికారికంగా జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ అధ్యక్షుడి హాదాలో జేడీయూ చీఫ్, సీఎం నితీశ్ కుమార్తో పరాస్ మాట్లాడానికి నిర్ణయించినట్లు సమాచారం. దీంతో ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్ కు మరో షాక్ తగిలినట్లు అయింది. కాగా, పార్టీలో ఏర్పడిన అసంతృప్తి కారణంగా చిరాగ్ పాశ్వాన్ ను ఎల్జేపీ లోక్ సభాపక్ష నేతగా,పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పరాశ్ బృందం తొలగించిన విషయం తెలిసిందే. పశుపతి కుమార్ పరాస్ ని ఎల్జేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా గుర్తిస్తూ లోక్ సభ సెక్రటేరియట్ ఇప్పటికే నోటిఫికేషన్ కూడా విడుదల చేపిన విషయం తెలిసిందే.
ఇక, ఎల్జేపీ లోక్ సభా పక్షనేతగా, పార్టీ జాతీయాధ్యక్ష పదవి నుంచి తనను తొలగించడం పూర్తిగా చట్టవిరుద్ధమని,ఈ విషయంపై పోరాడేందుకు సిద్ధమని బుధవారం ఎల్జేపీ వ్యవస్థాకుడైన దివంగత కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. గతకొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై చట్టపరంగా ముందుకు వెళ్తామన్నారు. ఎల్జేపీలో ప్రస్తుత పరిస్థితికి జేడీయూ కుట్ర ఉందని పాశ్వాన్ ఆరోపించారు. ఏదేమైనా తాను రామ్విలాస్ పాశ్వాన్ కుమారుడినని, సింహం బిడ్డనని..కచ్చితంగా పోరాడి విజయం సాధిస్తానని పాశ్వాన్ అన్నారు.