కూలిన ఇల్లు..నలుగురు పిల్లలను కాపాడి గర్భిణి మృతి

  • Published By: veegamteam ,Published On : February 1, 2019 / 05:41 AM IST
కూలిన ఇల్లు..నలుగురు పిల్లలను కాపాడి గర్భిణి మృతి

ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్‌లో గురువారం(జనవరి 31,2019) దారుణం జరిగింది. తన నలుగురు పిల్లలను అగ్ని ప్రమాదం నుంచి రక్షించబోయి ఓ తల్లి ప్రాణాలు కోల్పోయింది. 

బాధితురాలు ఫాతిమా (27) భర్త నడుపుతున్న బ్యాకరీలో రెండు గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. దీంతో భవనం మంటల్లో చిక్కుకుంది. మొదటి అంతస్తులో ఉంటున్న ఫాతిమా తన నలుగురు పిల్లలతో కలిసి చిక్కుకుపోయింది. ఆమె 8 నెలల గర్భవతి కావడంతో చుట్టుముట్టిన మంటల నుంచి తప్పించుకోలేకపోయింది.

మరోవైపు, ఫాతిమా భర్త, అతడి సోదరుడు మంటలు ఆర్పేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. అప్పటికే గుమిగూడిన స్థానికుల సూచన మేరకు ఆ నలుగురి పిల్లలను బాల్కనీలోకి తీసుకొచ్చి ఒకరి తర్వాత ఒకరిని కిందికి విసరేసింది. కింద ఉన్నవారు పిల్లలని జాగ్రత్తగా పట్టుకున్నారు. కానీ ఫాతిమాకు కిందకు వచ్చే శక్తి లేకపోవడంతో మంటల్లో చిక్కుకుపోయి స్పృహ కోల్పోయింది. కాసేపటికే భవనం కుప్పకూలింది. కళ్లముందే జరిగిన ఈ ఘటన స్థానికుల్లో విషాదం నింపింది.ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.