Rajeev Chandrasekhar : కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రికి ట్విట్టర్ ఝలక్
గత వారం కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ చంద్రశేఖర్ కి ట్విట్టర్ ఝలక్ ఇచ్చింది.
Rajeev Chandrasekhar గత వారం కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ చంద్రశేఖర్ కి ట్విట్టర్ ఝలక్ ఇచ్చింది. సోమవారం ఆయన ట్విట్టర్ అకౌంట్ కు బ్లూ టిక్ మార్క్ను తొలగించింది సోషల్ మీడియా దిగ్గజ సంస్థ. అయితే కొద్ది గంటల్లోనే మళ్లీ ఆయన అకౌంట్ కి బ్లూ టిక్ మార్క్ ని ట్విట్టర్ పునరుద్ధరించింది. కాగా, బ్లూ టిక్ మార్క్ తొలగింపుపై ట్విట్టర్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికార ప్రకటన వెలువడలేదు.
అయితే రాజీవ్ చంద్రశేఖర్.. తన ట్విట్టర్ ఖాతా పేరును రాజీవ్ ఎంపీ నుంచి రాజీవ్ జీవోఐగా మార్చడం వల్ల ఇలా జరిగిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా,గతంలో కూడా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్తో పాటుగా పలువురు ప్రముఖుల ట్విట్టర్ అకౌంట్ల బ్లూ టిక్ మార్క్ను తొలగించడం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత ట్విటర్ వీరి ఖాతాలకు బ్లూ టిక్ను పునరుద్దరించింది. కాగా, వెరిఫైడ్ ఖాతాలకు ట్విటర్ ఈ బ్లూ టిక్ ఇస్తుందన్న విషయం తెలిసిందే.